పేదలకు ప్రభుత్వ పథకాలలో తొలి ప్రయోజనం

సమాజంలో అట్టడుగు వర్గాన ఉన్న వ్యక్తులకు, సమాజంలో నిర్లక్ష్యానికి గురైన పేదలకు ప్రభుత్వ పథకాలలో తొలి ప్రయోజనం చేకూరాలని అంత్యోదయ విధానాన్ని రూపొందించిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు జి. కిషన్‌రెడ్డి తెలిపారు.  సోమవారం తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో పాల్గొంటూ అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడం, వారిని వృద్ధిలోకి తీసుకురావాలని కాంక్షించారని రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంగా ప్రజలకు సేవలందించాలని పిలుపునిచ్చారు.

భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు పండిట్‌జీ మరణం ఇంకా మిస్టరీగానే మిగిలిపోవడం బాధాకరమనిచెబుతూ  దేశ ప్రజలు, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తి దీన్ దయాళ్ అని కొనియాడారు. విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలు, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యమని నరేంద్ర మోదీ ప్రభుత్వం దీన్ దయాళ్ ప్రవచించిన అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడుతూ, వారి ఆశయాలకు పునరంకితమై పనిచేస్తోందని తెలిపారు.

పేద ప్రజలకు మేలు జరిగేలా ఉజ్వల యోజన ద్వారా పేదలకు గ్యాస్, జన్ ధన్ ఖాతాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదవారికి ఇండ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా టాయిలెట్ల నిర్మాణం చేపడుతోందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. మారుమూల ప్రాంతాలకు దీన్ దయాళ్ గ్రామ జ్యోతి యోజన ద్వారా ప్రతి గ్రామానికి కరెంట్ సరఫరా, ప్రతి ఇంటికీ తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తూ దేశంలోని ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా సేవలందిస్తోందని చెప్పారు. 

దీన్ దయాళ్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించి, ఆచరణలో చూపెడుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో దీన్‌దయాళ్‌ఆలోచనలకు అనుగుణంగా భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తోందని వెల్లడించారు.

 దీన్ దయాళ్ ఆశయాలకు అనుగుణంగా, క్రమశిక్షణ గల కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమంతా పనిచేస్తామని అవినీతికి వ్యతిరేకంగా, కుటుంబ రాజకీయాలకు తావివ్వకుండా, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.