పెరుగుతున్న టోఫెల్ కు హాజరయ్యే భారతీయుల సంఖ్య

విదేశాల్లో సెకండరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశించడానికి, సర్టిఫికెట్లు పొందడానికి నిర్వహించే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజి (టోఫెల్)కు హాజరయ్యే భారతీయుల సంఖ్య గత కొన్నేళ్లుగా పెరుగుతుంది. ఇదే సమయంలో ఇమ్మిగ్రేషన్ ప్రయోజనం కోసం నిర్వహించే పరీక్షకు హాజరయ్యేవారి శాతం తగ్గుతోందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఇటిఎస్) అధ్యయనం వెల్లడించింది. 

ప్రిన్సిటన్ కేంద్రంగా పనిచేసే ఇటిఎస్ సంస్థ ఈ టివొఇఎఫ్‌ఎల్ పరీక్షతోపాటు గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ (జిఆర్‌ఇ)ను నిర్వహిస్తోంది.  అభ్యర్థుల శాతం 2021లో 5.89 శాతం నుంచి 2022లో 7.77 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఉద్యోగాల కోసం, లేదా ఇమ్మిగ్రేషన్ కోసం ఈ పరీక్షకు హాజరయ్యేవారి శాతం 8.19 శాతం నుంచి 7.22 శాతానికి క్షీణించింది. 

2018 నుంచి ఈ ట్రెండ్‌ను తాము గమనిస్తున్నామని ఇటిఎస్ ఉన్నతాధికారులు తెలిపారు. బిజినెస్ ప్రోగ్రామ్‌లు కాకుండా, గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్ బిజినెస్ ప్రోగ్రామ్‌ల కోసం ఈ పరీక్షకు హాజరవుతున్న భారతీయుల సంఖ్య 2021లో 70.84 శాతం ఉండగా, 2022లో 71.87 శాతానికి పెరిగింది. ఇది యువ జనాభాలో ఆకాంక్షల్లో మార్పుకు ఉదాహరణ అని ఇటిఎస్ ఇండియా, దక్షిణాసియా మేనేజర్ సచిన్ జైన్ వెల్లడించారు.

అంతకుముందు సంవత్సరం కన్నా 2021లో ఈ పరీక్ష రాయాలనుకున్న అభ్యర్థుల సంఖ్య 53 శాతం పెరిగిందని, 2022లో 59 శాతం పెరిగిందని వివరించారు.  వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో విదేశాలకు వెళ్లనున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2.5 మిలియన్‌కు చేరుకుంటుందని అనేక పారిశ్రామిక నివేదికలు అంచనా వేస్తున్నాయని వివరించారు. మరోవంక, భారతీయ ప్రతిభావంతుల పట్ల ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ వంటి దేశాలు మొగ్గు చూపుతున్నాయి.

ఈ పరీక్ష రాసే అభ్యర్థులు భారత్‌లో న్యూఢిల్లీ , ముంబై, బెంగళూరు, పునె, హైదరాబాద్, గురుగ్రామ్, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాల నుంచే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. జులై 26 నుంచి ఈ ఇటిఎస్ పరీక్షలో కొన్ని మార్పులు చేశారు. ఎవరైతే మూడు గంటలు కాకుండా రెండు గంటల్లోనే పరీక్ష రాయడం పూర్తి చేస్తారో ఆయా అభ్యర్థులు తమకు వచ్చిన మార్కుల స్కోరు తేదీని ముందుగా తెలుసుకోవచ్చు.