కృష్ణా ట్రెబ్యునల్‌లో ఎపికి ఎదురుదెబ్బ

కృష్ణా ట్రెబ్యునల్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై 2022 డిసెంబర్ 18న ఏపీ దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను ట్రెబ్యునల్‌ తోసిపుచ్చింది. ఇంటర్‌లోక్యూటరీ అప్లికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన సమస్యలపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం తమకు లేదని తెలిపింది. 
 
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై లెవనేత్తిన ఆందోళనలపై తగిన వేదికలను ఆశ్రయించాలని కూడా ఏపీ ప్రభుత్వానికి కృష్ణా ట్రెబ్యునల్‌ సలహా ఇచ్చింది.  తెలంగాణ 90 టీఎంసీల నీరు వాడకుండా ఆపాలని ఏపీ ప్రభుత్వం ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ దాఖలు చేసింది.  2022 ఆగస్టు 18 నాటి జీవో నెంబర్ 246 అమలులోకి రాకుండా తెలంగాణను నిరోధించాలని ఏపీ సర్కార్ కృష్ణా ట్రెబ్యునల్‌ను అభ్యర్థించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో కౌంటర్‌ దాఖలు చేసింది. 
 
కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్-2 ఛైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్, సభ్యులు జస్టిస్‌ రామ్‌మోహన్‌రెడ్డి, జస్టిస్‌ ఎస్‌ తలపాత్ర ఇరుపక్షాల దాఖలైన పత్రాలను పరిశీలించడంతో పాటు, వాదనలను విన్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను ట్రెబ్యునల్‌ తోసిపుచ్చింది.