‘మీడియా ట్రయల్స్’ పట్ల సుప్రీంకోర్టు అసహనం

‘మీడియా ట్రయల్స్’ పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వ్యక్తులు లేదా సంస్థల పట్ల పత్రికలు, ఇతరత్రా సమాచార సాధనాలలో నిరంతరం అదే పనిగా పక్షపాత వార్తలను వెలువరించడం చివరికి మీడియా నుంచి సాగుతోన్న విచారణ మీడియా ట్రయల్స్‌గా మారిందని, ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉందని స్పష్టం చేసింది. 

ఈ ధోరణిని అరికట్టే విషయంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ వచ్చే మూడు నెలల్లో సరైన మార్గదర్శకాలను వెలువరించాలని ధర్మాసనం బుధవారం తెలిపింది. వ్యక్తులు ఏదో నేరం చేశారనే అనుమానాలను ఈ మీడియా ట్రయల్స్ ప్రజలలో కల్గిస్తున్నాయని, ఇది ఆక్షేపణీయం అని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. 

సంబంధిత విషయంపై తాము నిర్ధేశిస్తున్నట్లు వచ్చే మూడు నెలలలో గైడ్‌లైన్స్ ఖరారు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రతి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి, జాతీయ మానవ హక్కుల కమిషన్ తమ సూచనలు, ప్రతిపాదనలను నిర్ణీతగడువులోగా కేంద్ర హోం మంత్రిత్వశాఖకు సమర్పించాలి. ఇందుకు అనుగుణంగా తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి ( 2024)లో చేపడుతామని ధర్మాసనం తెలిపింది.

దీనిపై సంబంధిత పోలీసు అధికారులకు సరైన అవగావహన కల్పించాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసులకు సంబంధించి ఏర్పాటు చేసే ప్రెస్‌మీట్స్ దశలో పోలీసు వర్గాలు అనుసరించాల్సిన మార్గదర్శక సూత్రాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెలువరించాల్సి ఉందని ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్రాలు, హక్కుల సంస్థ తమ సూచనలను కేంద్రానికి నెలరోజుల్లో అందించాల్సి ఉంటుంది. 

మీడియా ట్రయల్స్ తంతుతో న్యాయ నిర్వహణకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ న్యాయం అన్యాయానికి గురవుతోందని తెలిపారు. వ్యక్తుల గురించి దర్యాప్తు జరిగే దశలో ఏ స్థాయిలో దర్యాప్తు వివరాలను వెల్లడించాలనేది కీలకమైన విషయం, దర్యాప్తు సాగుతున్న సమయంలో నేర నిర్ధారణ పూర్తిగా జరగని దశలో వీటి వివరాలను వెలువరించడం చివరికి పత్రిలలో పలు రకాల కథనాలకు దారితీస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది. 

ఏ దశలో దర్యాప్తు వివరాలను వెల్లడించాలనేది ఖరారు చేయాల్సి ఉందని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఇందులో బాధితులు, నిందితుల అంశాలు, వారికి సరైన న్యాయం జరిగే ప్రక్రియ ఇమిడి ఉందని ధర్మాసనం తెలిపింది. దర్యాప్తు క్రమంలో దోష నిర్ధారణ జరగడం వేరు, ఈలోగానే మీడియా ట్రయల్స్ తరహాలో వెలువడే వార్తలతో ముందుగానే దోషి అనే ముద్ర పడుతోందని తెలిపారు.

ప్రత్యేకించి నేరాలకు సంబంధించి వెలువడుతున్న మీడియా వార్తలలో పలు రకాల ప్రజా ప్రయోజనాల కోణాలు దాగి ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. 2017లో సంబంధిత విషయంపై వెలువడ్డ ఆదేశాల అమలు గురించి దాఖలు అయిన పటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సంబంధిత విషయంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విషయం ఇమిడి ఉంది. 

ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. మీడియాకు తమ ఆలోచనలు వ్యక్తం చేసే, వార్తలను వెలువరించే హక్కు ఉంది. దీనిని కాదనలేం. కానీ ఇదే దశలో ఈ పరిధి దాటి జరిగే మీడియా ట్రయల్స్‌ను మనం అనుమతించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

నేరాలు ఘోరాలకు సంబంధించి లేదా అక్రమాల దర్యాప్తునకు సంబంధించి మధ్యదశలోనే వెలువరించే మీడియా కథనాలు తప్పుదోవ పట్టడం ఇబ్బందికరం అని ధర్మసనం తెలిపింది. దర్యాప్తుల మధ్యలో వెలువడే ఇటువంటి ట్రయల్స్ చివరికి కేసులలో ఉండే కీలకమైన సాక్షాలను ముందుగానే వెల్లడించడం చివరికి దర్యాప్తును నీరుగారుస్తుందని అభిప్రాయపడ్డారు.