కశ్మీర్‌లో ఆర్మీ కల్నల్‌ సహా ముగ్గురు వీరమరణం!

* మరో ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్ మృతి 
 
జమ్ముకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒక రోజు వ్యవధిలోనే రెండు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఒక జవాన్, మరో పోలీస్ ఉన్నతాధికారి అమరులు అయ్యారు.  ఈ క్రమంలోనే ఆ ప్రాంతాన్ని మొత్తం ఆధీనంలోకి తీసుకున్న సైన్యం అక్కడ భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది.
ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య కాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, 19 రాష్ట్రీయ రైఫిల్స్‌ కమాండింగ్‌ అధికారి మేజర్‌ ఆశిష్‌ దోనక్‌, డిఎస్పీ హుమయూన్‌ భట్‌ మృతిచెందారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఈ దాడికి బాధ్యత వహించింది.  జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని కోకర్‌నాగ్ అటవీ ప్రాంతంలోని ఉగ్రవాదులు దాక్కొని ఉన్నారన్న సమాచారం భద్రతా బలగాలకు అందింది.
ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఆర్మీ, రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్, జమ్ము కశ్మీర్ పోలీసులు.. కలిసి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.  ఈ క్రమంలోనే భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఇందులోనే 19 వ రాష్ట్రీయ రైఫిల్స్‌ యూనిట్‌కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ఈ ఎదురుకాల్పుల్లో చనిపోయారు. 
 
ఆయనతోపాటు ఆర్మీ మేజర్ ఆశిష్ ధోంచక్ సహా జమ్ము కశ్మీర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హుమాన్యూ కూడా వీర మరణం పొందారు. జమ్ము కశ్మీర్‌లో కౌంటర్ ఇన్‌సర్జెన్సీ ఫోర్స్‌గా రాష్ట్రీయ రైఫిల్స్ పనిచేస్తోంది.  ఈ విషయం తెలుసుకున్న ఆర్మీ 15 కార్ఫ్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రాజివ్ ఘాయ్, జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ సహా ఉన్నతాధికారులు అందరూ సంఘటనా స్థలానికి చేరుకుని చేరుకున్నారు.
అక్కడ జరుగుతున్న ఎన్‌కౌంటర్‌ను పరిశీలించారు. చనిపోయిన భద్రతా బలగాల మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు. మరో ముగ్గురు అధికారులు కూడా తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.  ఇది 24 గంటల్లో జమ్ము కశ్మీర్‌లో జరిగిన రెండో ఎన్‌కౌంటర్ కావడంతో  అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మంగళవారం రాత్రి రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ జవాన్‌ వీర మరణం పొందగా,మరో ముగ్గురు భద్రతా బలగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను కూడా భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మిగిలి ఉన్న ఉగ్రవాదుల కోసం గాలింపు ఆపరేషన్ చేపట్టినట్లు భద్రతా బలగాల ఉన్నతాధికారులు వెల్లడించారు.
 
ఇలా ఉండగా, విశ్వాసంలో తనకు తానే సాటి అని ఓ ఆర్మీ జాగిలం మరోసారి చాటిచెప్పింది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జవాన్‌ ప్రాణాలను రక్షించిన ఓ జాగిలం అందరి చేత శభాష్‌ అనిపించుకుంది. కెంట్‌ అనే ఆరేండ్ల లాబ్రడార్‌ జాతికి చెందిన ఆడ జాగిలం 21వ ఆర్మీ డాగ్‌ యూనిట్‌లో సేవలందిస్తున్నది. 
 
ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్న ఆర్మీ జవాన్లను ఆ జాగిలం ముందుండి నడిపిస్తున్నది. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా ఉగ్రవాదులు కాల్పులు జరపగా… ముందే పసిగట్టిన కెంట్‌ ప్రాణాలకు తెగించి బుల్లెట్లకు ఎదురు నిలిచి జవాన్‌ను కాపాడింది. కెంట్‌ సేవలకు గానూ ఆర్మీ అధికారులు జాతీయ జెండాను మృతదేహంపై కప్పి అధికారికంగా అంత్యక్రియలు జరిపించారు.