తెలంగాణాలో బీజేపీ సీట్ల కోసం పెద్ద ఎత్తున రద్దీ

రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు భారతీయ జనతా పార్టీ టికెట్ల కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 4వ తేదీన ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఆదివారం ముగిసింది. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేకపోవడం తో పార్టీ టిక్కెట్ల కోసం భారీగా దరఖాస్తులు అందాయి. చివరి రోజు 2781 ఆశావహుల దరఖాస్తులు అందజేశారు. 
 
వారిలో ముఖ్యనేతల తరుపున వారి అనుచరులతో పాటు ఇతర పార్టీలకు చెం దిన నేతల సైతం తమ దరఖాస్తులను అందజేసి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. భారీగా తరలివచ్చిన ఆశావహులు, వారి అనుచరులతో రాష్త్ర బీజేపీ కార్యాలయం సందడిగా మారింది. సెప్టెంబర్ 4 నుంచి 10 వరకు మొత్తంగా 6,003 అప్లికేషన్లు వచ్చాయని తెలుస్తోంది.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు బీజేపీ దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో ఎమ్మెల్యే టికెట్ ఆశావహులు భారీగా పోటీ పడ్డారు. ఒక్కొక్కరూ 3, 4 స్థానాలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు రఘునందన్‌రా వు, ఈటల రాజేందర్ తరఫున వారి అనుచరుల దరఖాస్తు చేయగా, ఈటల సతీమణి జమున సైతం ఎమ్మెల్యే టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

పొంగులేటి ముఖ్య అనుచరుల్లో ఒకరైన దొడ్డ నగేష్ యాదవ్ బిజెపి అభ్యర్థిగా ఖమ్మం బరిలో ఉండేందుకు తన అనుచరున్ని పంపి దరఖాస్తు చేసుకున్నాడు. ఎమ్మెల్యేగా తాను దరఖాస్తు చేసుకోలేదని నిజామాబాద్ ఎంపి ధర్మపు రి అర్వింద్ తెలిపారు. అయితే, పార్టీ నిర్ణయం మేరకు తాను పని చేస్తానని అర్వింద్ చెప్పారు.

నగరంలోని ఐదు నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచేందుకు నటి జీవితా రాజశేఖర్ దరఖాస్తు చేసుకున్నారు.సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, శేరిలింగంపల్లి నుంచి గజ్జల యోగానంద్, ముషీరాబాద్ నుంచి బం డారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి, షాద్ నగర్ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, రాజేంద్ర నగర్ నుంచి మణికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కె. నరేందర్‌రెడ్డి, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, దరఖాస్తు చేసుకున్నారు. 

అదే  విధంగా, సనత్ నగర్ నుంచి ఆకుల విజయ, జనగామ నుంచి బేజాది బీరప్ప, పాలకుర్తి నుంచి యొడ్ల సతీష్ కుమార్, గాంధీ నగర్ కార్పొరేటర్ పావని దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 4న 182 దరఖాస్తులు రాగా, 5న 178, 6న 306, 7న 333, 8న 621 , 9న 1603, 10వ తేదీన 2781 దరఖాస్తులు వచ్చాయి.