తెలంగాణాలో వణికిస్తున్న వైరల్ జ్వరాలు

తెలంగాణాలో వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి.  జ్వర బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో నిన్నమొన్నటి వరకు గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌, ఫీవర్‌ ఆసుపత్రులలో 300 నుంచి 800 వరకు ఉండే ఓపి ఇప్పుడు ఏకంగా రోజుకు 1000 నుంచి 1500 వరకు నమోదవుతోంది. 

సాధారణ జ్వరంతో పాటు దగ్గు, జలుబు, శ్వాసకోశ ఇబ్బందులతోనే ఎక్కువ మంది ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా రాష్ట్రంలో వాతావరణంలో పెరిగిన మార్పులే ఈ పరిస్థితికి కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. 

వర్షాభావ పరిస్థితుల కారణంగా వాతావరణంలో ఒక్కసారిగా వేడిమి పెరిగిపోవడంతో శరీరంలో అనుకోని మార్పులు వస్తాయనీ, దీంతో జలుబు, దగ్గుతో కూడిన జ్వరం వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.  కొన్నిచోట్ల వర్షం, డ్రైనేజీ నీళ్లు కలవడం వల్ల తాగునీరు కలుషితం కావడం, నీటి నిల్వలు కూడా పెరిగి జ్వరాలు రావడానికి కారణమని స్పష్టం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కొత్త రకం వైరస్‌ వైద్యులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఆసుపత్రులకు వస్తున్న పలువురు జ్వర బాధితులకు స్వైన్‌ ఫ్లూ, కరోనా సంబంధిత పరీక్షలు చేయగా, ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. మరికొన్ని శ్వాసకోశ సంబంధిత కేసులు రాగా, వాటి ఫలితాలు కూడా కరోనాకు వ్యతిరేకంగా వచ్చాయి. 

దీంతో ఈ కేసులకు శ్వాసకోశ వైరస్‌కు సంబంధం ఉండి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.