ఆత్మాహుతి దాడిలో 9 మంది పాక్ సైనికుల మృతి

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి  రెచ్చిపోయారు. ఆర్మీయే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఖైబర్‌ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్‌ లోని బన్నూ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

ఆత్మాహుతి బాంబర్‌ మోటార్‌ సైకిల్‌పై భద్రతా అధికారుల వాహనానికి ఎదురెళ్లి తనను తాను కాల్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై పాకిస్థాన్‌ తాత్కాలిక పీఎం అన్వర్ ఉల్ హక్ కకర్ విచారం వ్యక్తం చేశారు. 

‘బన్నూ డివిజన్‌లో టెర్రరిస్టుల ఆత్మాహుతి దాడిలో 9 మంది సైనికులు మృతి చెందారనే వార్త విని గుండె  పగిలింది. అలాంటి చర్యలను ఖండిస్తున్నాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ దృఢంగా ఉంది’ అని తెలిపారు. ఈ దాడికి నిషేధిత తెహ్రీక్ – ఏ – తాలిబన్ పాకిస్థాన్‌ సంస్థ బాధ్యత వహించింది.

కాగా, ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్‌ ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులై 30వ తేదీన ఓ రాజకీయ పార్టీ సమావేశంలో ఆత్మాహుతి బాంబర్ పేలుడుకు పాల్పడటంతో 54 మంది మరణించారు. సుమారు 200 మందికి పైగా గాయపడ్డారు.