అత్త తిరగబడితే అల్లుడిని బదిలీ చేసిన కేసీఆర్

అత్త తిరగబడితే అల్లుడిని బదిలీ చేసిన కేసీఆర్

`అత్తమీద కోపం దుత్త మీద ..’ అన్నట్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను కాదని, మతం మారిన క్రైస్తవుడైన ఎన్ఆర్ఐ కు కేవలం కేటీఆర్ స్నేహితుడని కారణంతో బిఆర్ఎస్ సీట్ ఇవ్వడంతో కేసీఆర్ నాయకత్వంపై నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ తిరుగుబాటు ప్రకటించారు. తన ఎమ్యెల్యే పదవి కాలం ముగిశాక పార్టీ మారి తిరిగి పోటీ చేసి, గెలిచి చూపిస్తానంటూ సవాల్ చేశారు.

పైగా, ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానంలో మతం మారిన క్రైస్తవుడిని ఏవిధంగా నిలబెడతారంటూ ఆమె కేసీఆర్ ను నిలదీశారు. ఆమె ఈ విషయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. మహబూబాబాద్‌ ఎస్పీగా పనిచేస్తున్న రేఖానాయక్‌ అల్లుడు శరత్‌చంద్ర పవార్‌పై బదిలీ వేటు పడింది.  ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో 18 నెలలుగా ఇక్కడ ఎస్పీగా పనిచేస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోలీస్ అకాడమీకి బదిలీ చేసింది.  ప్రభుత్వం రాజకీయ కక్షతో అధికారులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రేఖానాయక్‌ పేరు గల్లంతైంది. దీంతో ఆమె కాంగ్రెస్‌ పార్టీలో టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఎన్నికల వరకు ఖానాపూర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ను బదిలీ చేసి ఉండొచ్చని చెబుతున్నారు.

2021, డిసెంబరు 26న శరత్‌చంద్ర పవార్‌ మహబూబాబాద్‌ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలో మల్టీ ఏజెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ – కమాండ్‌ కంట్రోల్‌ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గుండేటి చంద్రమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణాలో సాధారణ బదిలీలు లేకపోయినా జిల్లా ఎస్పీని మాత్రం ప్రత్యేకంగా బదిలీ చేశారు.