లింగంపల్లి- కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

లింగంపల్లి- కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే  కాకినాడ టౌన్-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ప్రకటించారు.  రైలు నెంబర్ 07439 కాకినాడ టౌన్‌- లింగంపల్లి రైలు సెప్టెంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో నడుస్తుందని తెలిపారు.
స్పెషల్ రైలు కాకినాడలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు లింగపల్లి చేరుకుంటుందని పేర్కొన్నారు.  లింగంపల్లి-కాకినాడ (రైలు నెం.07440) సెప్టెంబర్‌ 2 నుంచి 14 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ రైళ్లు సాయంత్రం 6.25 గంటలకు లింగంపల్లి స్టేషన్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుతుందని తెలిపారు. 
 
ప్రత్యేక రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, గుడివాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలో ఆగనున్నాయి. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
 
మరోవంక, విజ‌య‌వాడ డివిజ‌న్ లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు ర‌ద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దైన, దారి మ‌ళ్లించిన రైళ్ల వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో పెద్ద డివిజ‌న్ గా ఉన్న విజ‌య‌వాడలో టెక్నికల్ సమస్యల కారణఁగా ఈ మ‌ధ్య త‌ర‌చుగా రైళ్లను ర‌ద్దు చేస్తున్నారు. 
 
విజ‌య‌వాడ మీదుగా దూర‌ ప్రాంతాలకు నడిచే స‌ర్వీసులు ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి. రైల్వే ప్రాజెక్టులు, ఇంటర్ లాకింగ్ సిస్టమ్ పనుల కారణంగా ఇటీవల త‌ర‌చుగా రైళ్లను ర‌ద్దు చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల‌ు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.