జూన్ 2 వ తేదీ ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలో జరిగిన అత్యంత ఘోర రైలు దుర్ఘటనకు అనుమతులు లేని మరమ్మతులే కారణమని సీబీఐ పేర్కొంది. ఈ ప్రమాదం
దాదాపు 300 మందిని బలి తీసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ – సీబీఐ రైలు దుర్ఘటనపై కీలక విషయాలు వెల్లడించింది.
ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు సీబీఐ ముగ్గురిని అరెస్ట్ చేసింది. అయితే సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురిలో ఒకరైన అరుణ్ కుమార్ మహంత బెయిల్ కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా శుక్రవారం విచారణ జరగగా బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడమే ఒడిశా రైలు దుర్ఘటనకు కారణమని సీబీఐ కోర్టుకు తెలిపింది.
ఉన్నతాధికారుల నుంచి సరైన అనుమతులు తీసుకోకుండానే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంత క్షేత్ర స్థాయిలో మరమ్మతులు చేయించారని తెలిపింది. ఈ విషయాన్ని భువనేశ్వర్లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి వివరాలు వెల్లడించింది. బాలేశ్వర్లోని బహానగా బజార్ స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం జరిగిన 94 వ క్రాసింగ్ లెవెల్ గేట్ వద్ద మరమ్మతు పనులు అరుణ్ కుమార్ మహంత నేతృత్వంలోనే జరిగాయని కోర్టుకు సీబీఐ వివరించింది.
అయితే ఈ పనులు చేపట్టేందుకు అరుణ్ కుమార్ మహంత.. తన ఉన్నతాధికారి అయిన సీనియర్ డివిజినల్ ఇంజినీర్ నుంచి అనుమతులు గాన, సర్క్యూట్ చిత్రంగానీ తీసుకోలేదని తెలిపింది. గేట్ నెంబరు 79 వద్ద మరమ్మతులకు ఉపయోగించిన సర్క్యూట్ చిత్రం ఆధారంగానే మరమ్మతులు చేసినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొంది. అయితే ఆ పనులు జరుగుతున్నపుడు అరుణ్ కుమార్ మహంత అక్కడే ఉన్నారని, అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరింది.
అయితే అరుణ్ కుమార్ మహంత తరఫు న్యాయవాది లెవెల్ క్రాసింగ్ గేట్ సరిగా పని చేయడం లేదని ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించులేదని తెలిపారు. మెయింటెనెన్స్ పనులను బయటి వారికి అప్పగించారని, అందుకే ప్రమాదానికి అరుణ్ కుమార్ మహంతను బాధ్యుడిగా చేయడం తగదని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. మహంతకు బెయిల్ నిరాకరించింది.
సిగ్నల్, ఇంటర్లాకింగ్ ఇన్స్టాలేషన్లను పరీక్షించడం, మార్పులు చేయడం మహంత పనేనని తెలిపింది. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగానే పని చేయాల్సి ఉండేదని అభిప్రాయపడింది. విధుల్లో నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగి అంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుత ఆధారాల ప్రకారం ప్రమాదానికి ప్రధాన కారణం అరుణ్ కుమార్ మహంతనే అని భావిస్తున్నట్టు కోర్టు వెల్లడించింది.
కోరమాండల్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు మెయిన్లైన్లోకి వెళ్లడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చి వెంటనే విరమించుకున్నారు. అయితే అప్పటికే ఆ లైన్లోకి వెళ్లిన కోరమాండల్ అప్పటికే అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో కోరమాండల్లోని కొన్ని బోగీలు ఎగిరి పక్కన ట్రాక్పై పడ్డాయి. అదే సమయంలో అటుగా వస్తున్న బెంగళూరు – హౌర్ సూపర్ఫాస్ట్ రైలు వాటిని ఢీకొట్టి పట్టాలు తప్పింది.
More Stories
వయనాడ్లో ఓటమి భయంతో రాయ్బరేలి బరిలో
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు