24 మందితో టీటీడీ ట్రస్ట్ బోర్డు

రాజకీయ పునరావాస కేంద్రం: బీజేపీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి 24 మందితో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యులను నియమించారు. టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర రెడ్డి ఈనెల 10వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 15 రోజులకు పాలకమండలి సభ్యులను ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 24 మందితో కూడిన జాబితా సీఎంవో నుంచి దేవదాయ శాఖకు వెళ్లింది. వీరిలో ఏడుగురు పాతవారే. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

రాజకీయ ప్రాబల్యం ఉన్నవారి సిఫారసులకు, న్యాయవాదులకు అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నిందితుడు, తర్వాత అప్రూవర్‌గా మారిన పెనక శరత్‌చంద్రా రెడ్డికి టీటీడీ బోర్డులో చోటు కల్పించారు. ఆయన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి సోదరుడు కావడం గమనార్హం.

అదేవిధంగా, గుజరాత్‌కు చెందిన యూరాలజిస్ట్‌ డాక్టర్‌ కేతన్‌ దేశాయ్‌కి కూడా మరోసారి బోర్డులో చోటు కల్పించారు. 2001లో అప్పటి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పదవి కోల్పోయారు.  తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌కు చెందిన వారికి బోర్డులో చోటు కల్పించారు. తమిళనాడు నుంచి నలుగురికి ఈ జాబితాలో చోటు దక్కింది. 

హైకోర్టు న్యాయవాది కృష్ణమూర్తి వైద్యనాథన్‌కు వరుసగా నాలుగోసారి చోటు కల్పించారు. న్యాయ వర్గాల్లో ఆయనకు మంచి పట్టుందని సమాచారం.  ‘టీసీఎస్‌’ వేణు కుమారుడు సుదర్శన్‌ వేణుకు కూడా పదవి లభించింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు బాగా సన్నిహితుడైన బాలసుబ్రమణియన్‌ పళనిస్వామికి కూడా టీటీడీ బోర్డులో చోటు కల్పించారు.

మహారాష్ట్రలో శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే కార్యదర్శి మిలింద్‌ నర్వేకర్‌ను కూడా టీటీడీ బోర్డు సభ్యుడిగా రెండోసారి నియమించారు.  మహారాష్ట్రకు చెందిన సౌరభ్‌ బోరాకూ మరోసారి స్థానం కల్పించారు. ఇదే రాష్ట్రానికి చెందిన అమోల్‌కాలే గతంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉండగా, ఈసారి బోర్డులో సభ్యత్వం కల్పించారు. కర్ణాటక నుంచి వీఆర్‌ దేశ్‌పాండేకు బోర్డులో స్థానం కల్పించారు.

తెలంగాణ నుంచి చేవేళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌ రెడ్డి సతీమణి సీతా రెడ్డికి బోర్డు సభ్యురాలిగా స్థానం కల్పించారు.  ఇక ఏపీ నుండి, టీటీడీ పాలకమండలిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఎస్‌.ఉదయ్‌భాను, ముమ్మిడివరం ఎమ్మెల్యే పి.వెంకట సతీశ్‌ కుమార్‌, మడకశిర ఎమ్మెల్యే ఎం.తిప్పేస్వామిలకు అవకాశం దక్కింది. 

ఇంకా, సిద్ధవటం యానాదయ్య (కడప), సీహెచ్‌ అశ్వర్థ నాయక్‌ (అనంతపురం), మేకా శేషుబాబు (పశ్చిమగోదావరి), ఆర్‌.వెంకట సుబ్బారెడ్డి, యల్లారెడ్డిగారి సీతారామరెడ్డి (మంత్రాలయం ఎమ్మెల్యే సోదరుడు), గడిరాజు వెంకట సుబ్బరాజు (ఉంగుటూరు), శిద్ధా వీరవెంకట సుధీర్‌ కుమార్‌ (శిద్ధా రాఘవరావు కుమారుడు), ఎన్‌.నాగసత్యం (ఏలూరు), సామల రామిరెడ్డి, గడ్డం సీతారెడ్డిలను బోర్డులో నియమించారు.

రాజకీయ పునరావాస కేంద్రం

టిటిడి బోర్డును రాజకీయ పునరావాస కేంద్రమని మళ్లీ వైసిపి ప్రభుత్వం నిరూపించిందని బిజెపి ఎపి అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. బోర్డు సభ్యులుగా శరత్ చంద్రారెడ్డి, కేతన్ దేశాయ్ నియామకమే నిదర్శనమని ఆమె ధ్వజమెత్తారు. ఢిల్లీ మద్యం స్కామ్‌లో శరత్ చంద్రారెడ్డి పాత్రధారిగా ఉన్నారని, ఎంసిఐ స్కామ్‌లో దోషిగా తేలి కేతన్ దేశాయ్ పదవి కోల్పోయారని ఆమె గుర్తు చేశారు. తిరుమల పవిత్రతకు మచ్చ తెచ్చే విధానాన్ని బిజెపి ఖండిస్తోందని ఆమె స్పష్టం చేశారు.