తిరుమల కాలి నడక మార్గంలో  ఐదు చిరుతలు

గతంలో అప్పుడప్పుడు తిరుమల కాలినడక బాట, గెస్ట్ హౌస్ వద్ద వంటి ప్రాంతాల్లో కనిపించే వన్యమృగాలు ఎన్నడూ లేనివిధంగా గత కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి. బాలుడిపై దాడి చేసిన ఘటన మరవకముందే శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్న చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి మరణానికి కారణం అయింది.

దీంతో అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఈ కాలినడక మార్గాలు  ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. దీంతో టీటీడీ రంగంలోకి దిగింది. వన్యమృగాల రాకను అడ్డుకోవడానికి, భక్తులలో నెలకొన్న భయాందోళనలు తొలగించడానికి అనేక చర్యలు చేపట్టింది.

చిన్నారి లక్షితపై పంజా తర్వాత రెండు చిరుతలు చిక్కాయి. నామాలగవి ప్రాంత పరిసరాల్లో మొత్తం ఐదు చిరుతలు సంచరిస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మరో రెండు చిరుతల్ని బంధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ చిరుత బోన్‌ దగ్గరికి వెళ్లినట్టే వెళ్లి పక్క నుంచి వెళ్లిపోయింది. 

ఓ ఎలుగుబంటి కూడా ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్టు గుర్తించారు. ఈ రెండింటిని బంధించాలని చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
శేషాచలంలో ఎన్ని చిరుతలు ఉన్నాయనే దానిపై స్పష్టత లేదు. అయితే ట్రాప్‌ కెమెరాల్లో మాత్రం చిరుతల సంచారంతో వాటి సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. 

ఆపరేషన్‌ చిరుతలో దాదాపు వెయ్యి మంది సిబ్బంది పాల్గొంటున్నారు. అవసరమైతే ట్రాప్‌ కెమెరాలు, అధునాతన బోన్లతో పాటు సిబ్బందిని పెంచాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఆ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతుందని, భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తామంటున్నారు టీటీడీ, ఫారెస్ట్ అధికారులు. ప్రస్తుతానికి భక్తులకు భద్రత కల్పిస్తూ కొండపైకి పంపిస్తున్నారు.