థాయిలాండ్‌ ప్రధానిగా స్థిరాస్తి దిగ్గజం శ్రద్ధ ధవిసిన్‌

పాపులిస్ట్‌ ఫెయూ థాయి పార్టీకి చెందిన స్థిరాస్తి వ్యాపార దిగ్గజం శ్రద్ధ ధవిసిన్‌ థాయిలాండ్‌ 30వ ప్రధానిగా నియమితులు కావడానికి అవసరమైనన్ని ఓట్లు లభించాయి. ఓటింగ్‌ ఇంకా పూర్తి కానప్పటికీ గెలుపునకు అవసరమైన ఓట్లు శ్రద్ధకు వచ్చాయి.
అయితే పార్లమెంట్‌ వేదికపై ఒకరు కుప్పకూలడంతో ఇంకా దాదాపు 20 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వుండగానే ఓటింగ్‌ను నిలిపివేశారు. 11 పార్టీల సంకీర్ణానికి శ్రద్ధ నేతృత్వం వహించనున్నారు. ఎనిమిది కేబినెట్‌ పదవులు, 9 డిప్యూటీ కేబినెట్‌ పదవులను తాము తీసుకోనున్నట్లు ఫెయూ థాయి పార్టీ తెలిపింది. 
 
కాగా ఎన్నికల ఫలితాలకు ద్రోహం చేసేలా కొత్త ప్రభుత్వం వుందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రాజకీయ ప్రతిష్టంభనకు స్వస్తి పలికి, సామరస్యతను నెలకొల్పాలంటే ఇది అవసరమని ఫెయూ థాయి నేతలు సమర్ధిస్తున్నారు. నెలల తరబడి నెలకొన్న సస్పెన్స్‌, చట్టపరమైన తగాదాలు, సభ్యుల బేరసారాలు వీటన్నింటి ఫలితంగా ఎన్నికల్లో రెండో స్థానంలో వచ్చిన వ్యక్తి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి నెలకొంది. 
 
2006లో సైనిక కుట్రలో పదవీచ్యుతుడైన మాజీ ప్రధాని తస్కిన్‌ షినవ్రత 15 ఏళ్ళ తన ప్రవాసాన్ని ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన గంటల వ్యవధిలోనే పార్లమెంటరీ ఓటింగ్‌ జరిగింది. ఫెయూ థాయి పార్టీ విజయానికి తాను స్వదేశానికి తిరిగి రావడానికి సంబంధం ఏమీ లేదని తస్కిన్‌ చెబుతున్నారు.
ఇలా ఉండగా, థాయిలాండ్‌ జైలులో ఉన్న మాజీ ప్రధాని తక్సిన్‌ షినవత్రా (47) అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. తక్సిన్‌ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి వుందని అన్నారు. తక్సిన్‌కు గుండె, ఊపిరితిత్తులు, వెన్నెముక, రక్తపోటుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని, ఆయనను నిశితంగా పరిశీలిస్తున్నామని అసిస్టెంట్‌ నేషనల్‌ పోలీస్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ప్రచువాబ్‌ వాంగ్సుక్‌ తెలిపారు.
 
జైలులో వైద్యులు, వైద్య పరికరాలు లేకపోవడంతో ఆయనను పోలీస్‌ ఆస్పత్రికి తరలించామని ఆయన చెప్పారు.  ఇటీవల ప్రవాసం నుండి తిరిగి వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్బంధించిన మొదటి రోజే అనారోగ్యం పాలయ్యారని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం, వ్యక్తిగత ప్రయోజనాల వైరుధ్యాల్లో దోషిగా తేలడంతో తక్సిన్‌కు సుప్రీంకోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు మంగళవారం వెల్లడించింది.