మూతపడనున్న చారిత్రక లండన్ ఇండియా క్లబ్

లండన్ లోని చారిత్రక ఇండియా క్లబ్ వచ్చే నెల నుంచి మూత పడుతుంది. చరిత్ర పుటల్లోకి చేరుతుంది. లండన్ ఇండియా క్లబ్‌కు అత్యంత పురాతన ప్రఖ్యాతి ఉంది. భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో తొలిదశలో సంబంధాలు ఉన్నాయి. కృష్ణమీనన్ వంటి ప్రముఖ జాతీయవాదులతో ఈ క్లబ్ అలరారింది.  పలువురు భారతీయుల సమావేశాలకు, విందులకు ఇది కీలకమైన వేదికగా నిలుస్తూ వచ్చింది.

అయితే నడిబొడ్డున లండన్ స్ట్రాండ్స్‌లో ఉండే ఈ భవనం కొద్ది సంవత్సరాల క్రితం తొలిగింపు సమస్యను ఎదుర్కొంది. ఈ దశలో సాగిన న్యాయపరమైన పోరులో గెలిచింది. నిలబడింది.  అయితే ఇటీవలే ఈ భవనం యజమాని ఇక్కడ తాను అధునాతన హోటల్‌ను నిర్మించాలనుకుంటున్నట్లు, దీనిని ఖాళీ చేయాలని నిర్వాహకులకు నోటీసు వెలువరించారు.

దీనితో ఇప్పుడు మూతపడే పరిస్థితి ఏర్పడింది.  దీని నిర్వాహకులుగా ఉన్న యాద్గర్ మార్కర్, ఆయన కూతురు ఫిరోజా కలిసి సేవ్ ఇండియా క్లబ్ ఉద్యమం నిర్వహించారు. అయితే ఇప్పుడు వెలువడ్డ నోటీసుతో తామేమీ చేయలేని స్థితికి చేరినట్లు, ఇక మూసివేతనే మార్గం అని తెలిపారు.

‘అత్యంత బాధాతప్త హృదయంతో ఇండియా క్లబ్ మూసివేత గురించి తెలియ చేయాల్సి వస్తోంది. సెప్టెంబర్ 17వ తేదీ ఈ ఇండియా క్లబ్ సందర్శకుల వీక్షణకు నిలిచే చివరి రోజు అవుతుంది’ అని ప్రకటించారు. ఈ క్లబ్‌కు మీనన్ వంటి వారు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. తరువాత ఆయన బ్రిటన్‌కు తొలి భారతీయ హైకమిషనర్ అయ్యారు. 

దేశ స్వాతంత్య్రం తరువాత ఇండియా క్లబ్‌లో పలు భారతీయ రెస్టారెంట్లు వెలిశాయి. భారతీయ సంతతికి చెందిన వారు అనేక సార్లు ఇక్కడ ఇష్టాగోష్టిగా కలుసుకుంటూ వచ్చే వేదికగా చేసుకున్నారు. ఇక ఈ వేదిక కనుమరుగుకానుంది.