దేశీయంగా బియ్యం ధరలను నియంత్రించేందుకు ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం. తాజాగా ఉల్లి ఎగుమతుల విషయంలో అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఉల్లి ధరలను కట్టడి చేసి దేశీయంగా సరఫరాలను మెరుగుపరిచేందుకు ఎగుమతులపై 40 శాతం సుంకం విధించాలని నిర్ణయించింది. డిసెంబర్ 31 వరకు ఈ పన్ను అమలులో ఉంటుందని తెలిపింది.
తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఒక నోటిఫికేషన్లో తెలియజేసింది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బిఐతో కలిసి కేంద్రం ఓ వైపు కృషి చేస్తుండగా ఇటీవల బియ్య ధరలు పెరగడం ప్రారంభమైంది. దీంతో బియ్యం ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. మధ్యలో భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతిని టమాటా ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. దీంతో టమాటా ధరలను తగ్గించడానికి చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది.
మరో వైపు సెప్టెంబర్లో ఉల్లి ధరలు పెరుగుతాయన్న వార్తలతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. బఫర్ స్టాక్ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన కేంద్రం ఎగుమతులను తగ్గించే ఉద్దేశంతో ఉల్లి ఎగుమతులపై భారీగా సుంకం విధించింది.
కిలో రూ 40కే టమాటోలు
కాగా, గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటిన టమాటా ధరలు కొద్ది రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ ఇప్పటికీ అనేక చోట్ల కిలో రూ. 100కు పైగానే ఉంది. అందుకనే, ఈ నెల 20నుంచి నేషనల్ కో ఆపరేటివ్ కన్సూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్సిసిఎఫ్), నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్) కిలో రూ. 40కే రిటైల్ ధరకు టమాటాలు విక్రయించనున్నట్లు తెలుస్తోంది.
ధరల పెరుగుదల సమయంలో కూడా కేంద్రం తక్కువ ధరకే టమాటాలు అందించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నెల 15న ప్రభుత్వం టమాటా ధరలను కిలో రూ.50కి తగ్గించింది. తాజాగా ఈ ధరలను మరింత తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కేంద్రం ఏకంగా 15 లక్షల కిలోల టమాటాలను విక్రయించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోనే కాకుండా రాజస్థాన్, యుపి,బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కూడా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. గత 15 రోజుల్లోనే ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కేంద్రం 500 టన్నుల టమాటాలను విక్రయించింది. ఇదిలా ఉండగా గత కొద్ది రోజలుగా తగ్గుముఖం పట్టిన టమాటా ధరలు మరో వారం రోజుల్లో కిలో రూ.30 మామూలు స్థాయికి రావచ్చని అధికారులు అంటున్నారు.
More Stories
ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
ఎయిరిండియాలో ఇక ఉచిత లగేజి 15 కిలోలు మాత్రమే
బంగారం స్మగుల్డ్ చేస్తూ చిక్కిన అఫ్ఘన్ దౌత్యవేత్త