విద్య ప్రగతి దిశలో ఓ కాంతిపుంజం అవుతుందని పేర్కొంటూ విద్యారంగాన్ని రాజకీయ ఎత్తుగడలకు పావుగా మల్చుకోరాదని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హితవు చెప్పారు. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి)ను తాము రద్దు చేస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడంపై కేంద్ర మంత్రి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.
ఇది గర్హనీయ చర్య అని మండిపడుతూ విద్యా రంగ సంబంధిత అంశాలను రాజకీయ కోణాలలో చూడటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. ప్రగతికి సరైన దిశానిర్ధేశనం చేసే విద్యారంగం పట్ల సంకుచిత ధోరణి అనుచితం అవుతుందని తెలిపారు. ఎన్ఇపి 2020ని నిలిపివేస్తున్నట్లు కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడి సిఎం రాజకీయ దురుద్ధేశాలకు అనుగుణంగా నిర్ణయించుకుందని విమర్శించారు.
మన విద్యా వ్యవస్థ పరిణామాత్మకం కావాలని, అంతేకానీ తిరోగమన వాదాన్ని సంతరించుకోరాదని పేర్కొంటూ నెప్ 2020 అమాంతంగా తీసుకువచ్చిన ప్రక్రియ కాదని మంత్రి తెలిపారు. ఏండ్ల తరబడి తగు విధంగా సంప్రదింపులు జరిగాయి. నిపుణుల నుంచి సముచితమైన అధ్యయనం సాగిందని గుర్తు చేశారు.
అందరి ఆకాంక్షలకు అనుగుణంగా ఇది నిలుస్తుందని చెబుతూ అయితే దీనిని రద్దు చేయాలనే కర్ణాటక సిఎం నిర్ణయించుకోవడం, ఆయన దీనిని సమర్థించుకోవడం కేవలం సంస్కరణలకు వ్యతిరేకం మాత్రమే అవుతుందని ఆయన ధ్వజమెత్తారు. పైగా ఇది, భారతీయ భాషలకు అవమానకరం, కర్ణాటక విశిష్టతకు ప్రతిఘాతం అని ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి కర్ణాటకలో నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేస్తున్నట్లు సోమవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఎన్ఇపిని కేంద్ర ప్రభుత్వం ఆదరబాదరగా కర్నాటకలో ప్రవేశపెట్టిందని ఆరోపించారు. పైగా, రాజకీయ ప్రాబల్యం చాటుకునేందుకు ఈ విధంగా చేశారని, ఇప్పటికిప్పుడు దీనిని ఎత్తివేయడం కుదరనందున వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని ఎత్తివేస్తున్నట్లు సిఎం పేర్కొనడం వివాదాస్పదంగా మారింది.
More Stories
బెంగళూరులో సగం మంది ఓటర్లు ఇంటికే పరిమితం
కేజ్రీవాల్ జైలులో సీఎంగా కొనసాగడంపై హైకోర్టు అసహనం
రెండో దశలో 64.2 శాతం పోలింగ్