బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం దక్కింది. భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆయనకు ఇండియన్ సిటిజన్షిప్ లభించింది. దాంతో అక్షయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేస్తూ ఎక్స్లో (ట్విటర్లో) రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఫొటోను షేర్ చేశాడు. ‘ఆ ట్వీట్కు ‘దిల్ ఔర్ సిటిజన్షిప్, దోనో హిందుస్థానీ. హ్యాప్పీ ఇండిపెండెన్స్ డే..! జై హింద్..! (హృదయం, పౌరసత్వం రెండూ హిందుస్థాన్వే. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..! జైహింద్..!)’ అనే మెసేజ్ను జతచేశాడు.
కాగా.. తనకు కెనడా పౌరసత్వం ఉందని గతంలో అక్షయ్ కుమార్ వెల్లడించారు. 1990ల్లో తాను నటించిన 15 సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అప్పుడు కెనడాలో ఉండే ఒక స్నేహితుడు అక్కడికి రావాలని తనకు సలహా ఇచ్చాడని, అతని సూచన మేరకు కెనడా వెళ్లి పని చేసుకోవాలని నిర్ణయించుకున్నానని అక్షయ్ తెలిపాడు.
అందుకోసమే తాను కెనడా పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. అయితే ఇంతలోనే తాను చేసిన రెండు సినిమాలు భారత్లో ఘనవిజయం సాధించడంతో, కెనడాకి వెళ్లాల్సిన అవసరం తనకు రాలేదని పేర్కొన్నారు. అప్పటి నుంచి భారత్లోనే సినిమాలు చేసుకుంటూ ఉండిపోయానని, ఈ క్రమంలోనే తాను పాస్పోర్ట్ విషయం మర్చిపోయానని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
2019 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని అక్షయ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు.. కెనడా పౌరసత్వం కలిగి ఉండటంపై అతని మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఓటు హక్కు లేని వ్యక్తితో ప్రధాని ఎలా ఇంటర్వ్యూ చేస్తారన్న ప్రశ్నలూ లేవనెత్తాయి. అదే సమయంలో ప్రతీ భారతీయుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని అక్షయ్ చెప్పడంతో అతనిపై మరిన్ని విమర్శలు వచ్చిపడ్డాయి.
అసలు భారతీయ పౌరసత్వమే లేనివాడు, ఓటు హక్కు కోసం పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అప్పుడు తాను పాస్ట్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నానని అక్షయ్ పలుమార్లు వెల్లడించాడు. అయితే కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అతనికీ పౌరసత్వం విషయంలో స్వాతంత్ర్యం లభించింది.
More Stories
వీసీల నియామకంపై రాహుల్ వాఖ్యాలపై విద్యావేత్తల ఆగ్రహం
ఎన్నికల వేళ అయోధ్యలో మోదీ రామయ్య దర్శనం
ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీస్