ఉమ్మడి పౌరస్మృతిపై 75 లక్షలకు పైగా స్పందనలు

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై ప్రజలు, వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏర్పాటైన 22వ లా కమిషన్‌కు ఇంతవరకూ 75 లక్షలకు పైగా స్పందనలు అందాయి. ఈ విషయాన్ని లా కమిషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. యూసీసీపై అభిప్రాయాలను తెలియజేసేందుకు ఇచ్చిన గడువును పొడిగించేది లేదని పేర్కొంది. 

తమకు అందిన 75 లక్షల స్పందనలలో 2 లక్షలకు పైగా అభిప్రాయాలను ప్రధాన మంత్రికి పార్వార్డ్ చేసినట్టు చెప్పింది.  యూసీసీపై వచ్చిన స్పందనల సంకలనం పని జూలై 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని, ఫీడ్ బ్యాక్ ఆధారంగా స్పందనల విశ్లేషణ ఉంటుందని లా కమిషన్ తెలిపింది. ఎంపిక చేసిన పార్టీలతో ముఖాముఖీ చర్యలను కూడా ప్యానల్ జరుపనుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఒక కార్యక్రమంలో యూసీసీ అంశాన్ని ప్రస్తావించారు. ఒకే ఇంట్లో రెండు చట్టాల ఉంటే పురోగతి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఏకరీతి చట్టం అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఈ నేపథ్యంలో యూసీసీపై దేశవ్యాప్త చర్చ మొదలైంది. ప్రజల వ్యక్తిగత వ్యవహారాలైన పెళ్లి, విడాకులు, ఆస్తి పంపకాలు, దత్తత వంటి అంశాల్లో మతానికి సంబంధం లేకుడా ఒకే విధమైన చట్టాన్ని తీసుసురావడమే యూసీసీ.

భారత్ లో మతం ఆధారంగా వ్యక్తిగత చట్టాలు ఉన్నందున వాటి స్థానే ఒకే చట్టాన్ని తీసుకురావడం యూసీసీ ఉద్దేశం.  ఉమ్మడి పౌర స్మృతి కోసం ప్రభుత్వం ప్రయత్నించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో ఉన్నందున ఈ దిశగా కేంద్రం పావులు కదుపుతోంది. గతంలోనూ కేంద్రంలోని ప్రభుత్వాలు ఉమ్మడి పౌరస్మృతిపై చర్చలు జరిపినా, అది కార్యరూపం దాల్చలేదు.

భిన్న మతాలు, విభిన్న ఆచార, సాంప్రదాయాలు, భిన్నత్వాలకు నెలవైన భారతదేశంలో యూసీసీని అమలు చేయడం కష్టమనే అభిప్రాయలు ఉన్నాయి.  అయితే ఉమ్మడి పౌర స్మృతితో అందరికీ సమాన హక్కులు లభిస్తాయని, లింగ సమానత్వం ఏర్పడుతుందని కేంద్రం వాదనగా ఉంది. 2019 బీజేపీ ఎన్నికల ఎజెండాలోనూ ఉమ్మడి పౌరస్మృతి అంశం ఉంది.