వచ్చే 25 ఏళ్లలో దేశ రాజకీయాల్లో ఎన్డీయే కీలక పాత్ర

దేశంలో స్థిరమైన పాలన అందించడానికే ఎన్డీఏ కూటమి అని చెబుతూ వచ్చే 25 ఏళ్లలో దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. బెంగళూరులో ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టుకుని, ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై యుద్ధం ప్రకటించిన కొద్దిసేపటికే దేశ రాజధాని న్యూఢిల్లీలో బీజేపీ సారధ్యంలో 38 పార్టీలతో కూడిన ఎన్డీఏ మెగా భేటీ జరిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ అద్వానీయే ఎన్డీఏకు మార్గదర్శకులు అని, ఎన్డీఏను నిర్మించింది వాజ్‌పేయ్‌, అద్వానీయే అని గుర్తు చేశారు. కూటమిలోకి కొత్త మిత్రులకు స్వాగతం పలుకుతూ ఎన్డీఏ పట్ల అన్ని వర్గాల్లో విశ్వాసం ఉందని తెలిపారు. దేశ ప్రగతిలో ఎన్టీఏ పాత్ర అత్యంత కీలకం అని చెబుతూ దేశంలో ప్రజా వ్యతిరేక కూటములు ఎప్పుడు సఫలం కాలేదని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రజా వ్యతిరేక కూటమి అని ధ్వజమెత్తారు.  దేశంలో అస్థిరతను సృష్టించేందుకే కాంగ్రెస్‌ పార్టీ కూటములను ఏర్పాటు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాలను పడగొట్టడమే దాని లక్ష్యమని, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆ కూటమి ఏర్పాటవుతోందని విమర్శించారు. ఇలాంటి వ్యతిరేక దృక్పథం కలిగిన కూటములు సఫలం కావని స్పష్టం చేశారు.

ఆత్మనిర్భర్‌, భారత్‌ పురోభివృద్ధి లక్ష్య సాకారానికి కృషి చేస్తూ దేశ ప్రజలు కొత్త సంకల్పంతో ముందడుగు వేస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్డీఏకు కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రధాని మోదీ. ఎన్- న్యూ ఇండియా, డి- డెలవప్‌నేషన్‌, ఎ – యాస్పిరేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ అని వివరించారు.  అన్ని వర్గాలకు ఎన్డీఏపై పూర్తి నమ్మకం ఉందని చెబుతూ అందరి కృషి వల్లే దేశం అభివృద్ధి పథంలో సాగుతుందని మోదీ చెప్పారు.

“ఎన్డీఏ హయాంలో 13.5 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు పైకి వచ్చారు. ప్రణబ్‌ ముఖర్జీకి భారతరత్న ఇచ్చిన ఘనత ఎన్డీఏది” అని తెలిపారు.  “విపక్ష పార్టీలు నన్ను నీచుడు అని నిందిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరుస్తుంది. ఎన్డీఏ కూటమిలో చిన్న, పెద్ద పార్టీలంటూ తేడా ఏం లేదు. గాంధీ, అంబేద్కర్‌, లోహియా సిద్ధాంతాలను ఎన్డీఏ ఆచరిస్తుంది” అని భరోసా ఇచ్చారు. 

ఆదివాసి మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత ఎన్డీఏది అని పేర్కొంటూ అవినీతిని అంతం చేసేందుకు అన్ని మార్గాలు ఉపయోగిస్తున్నామని స్పష్టం చేశారు. మేకిన్‌ ఇండియా నినాదంతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెబుతూ సమిష్టి కృషితోనే ప్రభుత్వాలు ఏర్పాడుతాయని తెలిపారు. అవినీతి ఉద్దేశంతో కూటమి ఏర్పడినప్పుడు, కులతత్వాన్ని, ప్రాంతీయతను దృష్టిలో ఉంచుకుని పొత్తు పెట్టుకున్నప్పుడు, బంధుప్రీతి విధానంలో పొత్తు పెట్టుకున్నప్పుడు అలాంటి కూటములు దేశానికి హానికరమని ప్రధాని మోదీ హెచ్చరించారు.

2014కి ముందు సంకీర్ణ ప్రభుత్వం విధాన పక్షవాతంతో ఇరుక్కుపోయిందని విమర్శించారు. “ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ఏర్పాటు కాలేదు. మరొకరికి శత్రువుగా ఉండేందుకు ఎన్డీఏ ఏర్పాటు కాలేదు. స్థిరమైన ప్రభుత్వం వల్లే ప్రపంచానికి మనపై నమ్మకం పెరిగింది. ప్రతిపక్షంలో ఉన్నా విలువలతో కూడిన రాజకీయాలు చేశాం” అని ప్రధాని తెలిపారు.

 రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యం అని చెబుతూ దేశ ప్రగతి నినాదంతోనే ఎన్డీఏ ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తున్నామంటూ  దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుందని ప్రధాని ప్రకటించారు. దేశ ప్రజల ఆకాంక్షల నెరవేర్చడమే తమ అజెండా అని తెలిపారు. 

దేశ ప్రగతి కోసం శక్తివంచన లేకుండా పని చేస్తున్నామని చెబుతూ నవ భారత నిర్మాణం ఎన్డీఏ లక్ష్యం అని చెప్పారు. దేశం తలవంచుకునే పనులు ఎన్డీఏ ఎప్పుడూ చేయదని ప్రధాని హామీ ఇచ్చారు. నిబద్ధతతో ప్రజలు తల ఎత్తుకునేలా పాలన సాగిస్తున్నామని మోదీ వెల్లడించారు. భేటీ హాజరైన నేతలను ప్రధాని మోదీ పలకరించారు. ఈ సందర్భంగా పార్టీల నేతలంతా  గజమాలను ప్రధాని మెడలో వేశారు. అనంతరం భేటీ మొదలైంది.