ఆస్ట్రేలియాలో పశ్చిమ తీరం వెంబడి ఓ బీచ్లో ఓ భారీ స్థాయి లోహ సిలిండర్ పడి ఉండటం సంచలనానికి దారి తీసింది. ఇది చాలా ప్రమాదకరమైన వస్తువు అని, దీని దరిదాపుల్లోకి వెళ్లరాదని బీచ్కు చేరే వారిని అధికారులు హెచ్చరించారు. హిందూమహాసముద్రం వెంబడి ఉండే మిడ్వెస్ట్ కోస్టులో గ్రీన్ హెడ్ టౌన్ వద్ద పడిన ఈ భారీ లోహశకలంపై పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి.
ఇది విమానంలో నుంచి జారిపడ్డ వస్తువు కాదని, యుఎఫ్ఒది అయినా లేదా గల్లంతయిన మలేసియా విమానం శకలం అయినా అయి ఉంటుందని తొలుత వార్తలు వెలువడ్డాయి. రాగి రంగులో ఉన్న ఈ వస్తువు పూర్తిగా దెబ్బతిని ఉంది. ఈ లోహశకలం ఏమిటనే అంశంపై ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ ప్రతినిధి ఒక్కరు స్పందించారు.
ఇటీవల భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్ 3 శకలం అయి ఉంటుందని పరోక్షంగా అనుమానం వ్యక్తం చేశారు. ఏదో ఒక విదేశీ అంతరిక్ష వ్యోమనౌక నుంచి ఇది జారి పడి ఉంటుందని, సముద్రంలో పడి తీరానికి చేరి ఉంటుందని ఈ ప్రతినిధి తెలిపారు. సంబంధిత వస్తువు గురించి తాము ఇప్పుడు వివిధ దేశాల స్పేస్ అధికారిక సంస్థలతో మాట్లాడుతున్నామని వివరించారు.
ఇటీవల ఏదైనా విదేశీ సంస్థ అంతరిక్ష ప్రయోగం చేసి ఉంటే, ఈ వస్తువు వారికి సంబంధించినదా? అనేది నిర్ధారించుకుని తెలియ చేయాలని సూచించారు. కాగా స్పేస్ ఆర్కియాలజిస్టు డాక్టర్ అలైస్ గోర్మెన్ గార్డియన్ పత్రికతో మాట్లాడుతూ ఇది ఇంధన సిలిండర్ అని, భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్ 3 నుంచి విడిపోయిన శకలం అని ఖచ్చితంగా తెలిపారు.
ఏది ఏమైనా ఇది సముద్రంలో నుంచి కొట్టుకు వచ్చిన చెత్త కాదని, స్పేస్ నుంచి వచ్చిపడిందే పేర్కొన్నారు. చంద్రయాన్-3ను ఎల్వీఎం రాకెట్ నింగిలోకి మోసుకెళ్లిన దృశ్యాలు ఆస్ట్రేలియాలో కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 మిషన్కు సంబంధించిన శకలాలే అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి.
అయితే, సంబంధిత మిస్టరీ వస్తువు విషయంపై ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ కానీ, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు.
More Stories
బ్రిటన్ పార్లమెంట్ కు జులై 4న ముందస్తు ఎన్నికలు
భారత సంతతి శాస్త్రవేత్త కులకర్ణికి ప్రతిష్ఠాత్మక షా ప్రైజ్
ఇరాన్ అధ్యక్షుడి మరణంతో సంబరాలు!