సైబర్ దాడులకు లక్ష్యంగా మారిన పలు భారతీయ సంస్థలు

భారతదేశంలో కీలకమైన పలు సంస్థలు సైబర్ దాడులకు లక్ష్యంగా మారుతున్నాయి. అంతర్జాతీయ సగటుకన్నా భారతీయ సంస్థలే ఎక్కువగా సైబర్ దాడులకు గురవుతున్నాయి. ఆరు నెలల్లో ఒక భారతీయ సంస్థ సగటున వారానికి 2,146 సైబర్‌ దాడులను ఎదుర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఒక సంస్థపై 1,239 దాడులు జరిగాయి. 
ఈ పరిణామాలు సైబర్‌ సెక్యూరిటీ ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నల్టు సోమవారం విడుదలైన ‘థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ 2023’ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో హెల్త్‌కేర్‌ (4,839), విద్య, పరిశోధన (3,532), ప్రభుత్వం/సైనిక (3,017), బీమా/లీగల్‌ (2,523) తదితర రంగాలకు సంబంధించిన సంస్థలు సైబర్‌ దాడులకు లక్ష్యాలుగా మారాయి.

ప్రపంచవ్యాప్తంగా, రెండవ త్రైమాసికం (క్యూ2) 2023లో గ్లోబల్‌ వీక్లీ సైబర్‌ ఎటాక్‌లలో 8 శాతం పెరుగుదల కనిపించింది. విద్య, పరిశోధన రంగం వారానికి అత్యధిక సంఖ్యలో దాడులను ఎదుర్కొంది. ఆఫ్రికా, ఎపిఎసి దేశాల్లోని ప్రతి సంస్థపై జరుగుతున్న వారాంతపు దాడులలో అత్యధిక వార్షిక పెరుగుదల నమోదైంది.

 ”ఇటీవలి నెలల్లో సైబర్‌ ల్యాండ్‌స్కేప్‌పై రష్యా-ఉక్రేనియన్‌ వివాదం అంతరాయం కలిగించే ప్రభావం సాపేక్షంగా తగ్గినప్పటికీ, ముప్పు సాధారణ స్థితికి తిరిగి వచ్చింది. ఈ కొత్త సాధారణం సైబర్‌టాక్‌ల పెరుగుదల ద్వారా వర్గీకరించబడింది” అని నివేదిక పేర్కొంది.

సైబర్‌ ముప్పు ల్యాండ్‌స్కేప్‌పై సంఘర్షణ ప్రభావం క్షీణిస్తున్నప్పటికీ, నానాటికీ పెరుగుతున్న దాడులను ఎదుర్కొనడానికి అధిక నిఘా, పటిష్టమైన సైబర్‌ సెక్యూరిటీ చర్యలు అవసరమని ఈ నివేదిక హైలైట్‌ చేసింది. దీనికితోడు చాట్‌ జిపిటి వంటి కృత్రిమ మేథ టెక్నాలజీల విప్లవం సైబర్‌ నేరగాళ్ల వికృత చర్యలను సరిహద్దులు దాటేలా చేస్తున్నది. 

2023 క్యు2లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 44 సంస్థలలో ఒకటి సైబర్‌ ముప్పును ఎదుర్కొన్నది. ఎపిఎసి, యూరప్‌ దేశాల విషయానికొస్తే ఏటికేడాది రాన్‌సంవేర్‌ దాడులు గణనీయంగా పెరుగుతున్నాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.