వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ ఆరంభంలో జబెర్ పైచేయి సాధించింది. తొలి సెట్లో రెండు గేమ్లు గెలిచింది. అయితే, వెంటనే మార్కెటా వొంద్రొసోవా పుంజుకుంది. స్లో స్లైస్లు, అద్భుతమైన యాంగిళ్లతో బంతిని బాదింది. అద్భుతంగా ఆడింది. జబెర్ మళ్లీ పుంజుకున్నా.. మార్కెటా మరోసారి విజృంభించింది. తొలి సెట్ను 6-4తో కైవసం చేసుకుంది.
రెండో సెట్లో వొంద్రొసోవా, జబెర్ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఓ దశలో సెట్ 3-3కు వచ్చింది. ఆ తరుణంలో జబెర్ ఓ గేమ్ గెలిచి ముందంజ వేసింది. అయితే, ఆ తర్వాత మార్కెటా వొంద్రొసోవా విజృంభించింది. దూకుడుగా ఆడింది. ఇక ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. జబెర్ సర్వీస్ను కూడా చెక్ ప్లేయర్ బ్రేక్ చేసింది.
రెండో సెట్ను కూడా 6-4తో కైవసం చేసుకొని.. మ్యాచ్ గెలిచింది వొంద్రొసోవా. జబెర్కు షాకిచ్చి.. టైటిల్ ఎగరేసుకుపోయింది. కాగా, ఈ మ్యాచ్ మొత్తం మీద ఒకే ఏస్ (జబెర్) నమోదైంది. ప్రత్యర్థి సర్వీస్ను వొంద్రొసోవా ఆరుసార్లు బ్రేక్ చేసి ఆధిపత్యం చెలాయించింది. 2022 వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లోనూ ఓన్స్ జబెర్.. రిబకినా చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా అన్సీడెడ్ వొంద్రొసోవా చేతిలో ఓడి తన గ్రాండ్స్లామ్ కలను జబెర్ మరోసారి చేజార్చుకుంది.
More Stories
ఉక్రెయిన్లో నాలుగు పవర్ ప్లాంట్లు ధ్వంసం
సియాచిన్ గ్లేసియర్ వద్ద చైనా సరికొత్త రాదారి
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్