ఫ్రాన్స్ నేషనల్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ

ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు జులై 13, 14 తేదీల్లో ప్రధాని అక్కడ పర్యటిస్తారు. ఐరోపా లోనే అతిపెద్ద సైనిక కవాతుగా పేరొందిన ఫాన్స్ నేషనల్ డే పరేడ్ జులై 14న పారిస్‌లో జరుగుతుంది. 

ఆ పరేడ్‌లో మోదీ పాల్గొంటారు. అందులో భారత సైనిక బృందాలు కూడా పాల్గొంటాయి. ప్రధాని గౌరవార్ధం ఫ్రాన్స్ అధ్యక్షుడు అధికారిక విందుతో పాటు ప్రైవేట్ విందును కూడా ఇవ్వనున్నారు. ఇరువురు నేతలు వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరుపుతారు. 

ఫ్రాన్స్ ప్రధానితో పాటు సెనెట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులతోనూ భేటీ అవుతారు. అనంతరం అక్కడి ప్రవాసి భారతీయులు, భారత్, ఫ్రెంచి సంస్థల సీఈవోలు, ఇతర ప్రముఖులతోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ సంవత్సరం భారత్ – ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యపు 25వ వార్షికోత్సవం కావడం గమనార్హం.

తిరుగు ప్రయాణంలో మోదీ జులై 15న యూఏఈలో పర్యటిస్తారు. యూఏఈ అధ్యక్షుడు అబుదాబి పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నయాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇంధన, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, ఫిన్‌టెక్, రక్షణ, సాంస్కృతిక విభాగాల్లో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడంపై ఇరువురు నేతలు చర్చలు జరుపుతారని వివరించింది.