తెలుగు రాష్ట్రాలను కలుపుతూ నాలుగు వరుసల జాతీయ రహదారి

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 255 కి.మీ. మేర నిర్మించ తలపెట్టిన నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.4706 కోట్ల అంచనా వ్యయంతో 91 కి.మీ.లు నిర్మించనున్న ఈ ప్రాజెక్టు రాష్ట్రంలోని నాగర్‌కర్నూలు వద్ద ప్రారంభం కానుంది. తెలంగాణలో రూ.2406 కోట్లు, ఏపీలో 2300 కోట్లు ఈ ప్రాజెక్టు వ్యయంగా ప్రాథమికంగా అంచనా వేశారు.

కాగా, తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఏపీలోని వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు వరకు 255 కి.మీ.ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు. నాలుగు లేన్లుగా నిర్మించనున్న ఈ రహదారికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగు కానున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 

కాగా, రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ నిర్మించే ఈ జాతీయ రహదారి నం. 167ను మొత్తం ఏడు ప్యాకేజీల కింద నిర్మించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ రూ.2,406 కోట్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసింది. మొదటి ప్యాకేజీ కింద రూ.888,69 కోట్లు, రెండో ప్యాకేజీ కింద రూ.1,082.40 కోట్లు, మూడో ప్యాకేజీ క ఇంద రూ.436.91 కోట్లతో రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్ల ప్రక్రియను చేపట్టింది. 

కాగా, ఏపీలో రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో 164 కి.మీ.ల మేర జాతీయ రహదారిని నిర్మించనున్నారు. ఇందుకోసం మొత్తం నాలుగు ప్యాకేజీల కింద రహదారిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏపీలోని నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం నుంచి వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు వరకు ఈ రహదారిని నిర్మిస్తారు. 

మొదటి ప్యాకేజీ కింద 62.57 కి.మీ.ల మేర రహదారి నిర్మాణానికి రూ. 785 కోట్లతో రహదారి పనులను డీపీఆర్‌ను సిద్ధం చేశారు. రహదారిలో అంతర్భాగంగా ఇప్పటికే కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. మరో మూడు నెలల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి ఏడాదిన్నర నుంచి రెండేళ్లలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ ప్రణాళికలు రూపొందిస్తోంది. 

ఈ రహదారి నిర్మాణం పూర్తయితే, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణం మరింత సులభతరం కానుంది. దీంతో పాటు రహదారి వెంట అభివృద్ధి జరిగి పెట్టుబడులకు, నూతన పరిశ్రమల రాకకు అవకాశం ఏర్పడనుంది.