కాళ్లు కడిగి, క్షమాపణ చెప్పిన సీఎం చౌహన్

మధ్య ప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా అవమానించిన గిరిజనుడికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ క్షమాపణ చెప్పారు. బాధితుని తన అధికార నివాసంకు ఆహ్వానించి,  పాదాలను కడిగి, శాలువతో సత్కరించారు. నిందితుడిని బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేయడంతోపాటు, అతని ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేశారు.

దశమత్ రావత్ అనే గిరిజన కూలీపై ప్రవేశ్ శుక్లా అనే ఓ బిజెపి కార్యకర్త మూత్ర విసర్జన చేస్తున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో ఇటీవల బయటపడింది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. ముఖ్యమంత్రి శివరాజ్ వెంటనే స్పందించి, నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

బాధితుడిని తాను భోపాల్‌లో కలుస్తానని, క్షమాపణ చెబుతానని ప్రకటించారు. నిందితుడిని పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 294 (అసభ్యకర చర్యలకు పాల్పడటం), 504 (శాంతికి భంగం కలిగేవిధంగా ఉద్దేశపూర్వకంగా అవమానించడం), ఎస్సీ, ఎస్టీ చట్టం, జాతీయ భద్రత చట్టం ప్రకారం నిందితునిపై ఆరోపణలను నమోదు చేశారు. 

బుధవారం సాయంత్రం నిందితుని అక్రమ ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేశారు. ఆ సమయంలో ఆయన తల్లి స్పృహ కోల్పోయారు. మధ్య ప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ, నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సీఎం చౌహాన్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో సిద్ధి జిల్లాలో ఓ వ్యక్తి మరొక వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోందని, ఆ విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి, జాతీయ భద్రత చట్టం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 

ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. బాధితుడిని, ఆయన కుటుంబ సభ్యులను తాను భోపాల్‌లో కలుస్తానని చెప్పారు. బాధితుడు దశమత్ రావత్‌ను శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం కలిశారు. రావత్‌ను కుర్చీలో కూర్చోబెట్టి, ఆయన పాదాలను శివరాజ్ కడిగారు. ఆయనకు శాలువ కప్పి సత్కరించి, క్షమాపణ చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. తన మనసు ఎంతో బాధతో నిండిపోయిందని, ప్రజలే తనకు దేవుళ్లని ముఖ్యమంత్రి చెప్పారు.

“ఇప్పుడు ఇక నీవు నా స్నేహితుడివి” అని ముఖ్యమంత్రి అతనితో చెప్పారు. పిల్లలు చదువుతున్నారా? ఉపకారవేతనాలు వారికి అందుతున్నాయా? మరేమైనా సమస్యలు ఉన్నాయా? అంటూ ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ సానుకూల సమాధానాలు ఇవ్వడంతో, మరేమైనా తనను సంప్రదించమని సూచించారు.  ఆ తర్వాత వారు అల్పాహారం చేశారు.
మరో కొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్య ప్రదేశ్ లో ఈ సంఘటన రాజకీయ దుమారం రేపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఐదుగురు సభ్యులతో ఓ విచారణ కమిటీని  నియమించి, దీనిపై రాజకీయ పోరాటానికి సిద్దమైనది. అయితే ముఖ్యమంత్రి చౌహన్ స్వయంగా రంగంలోకి దిగి నష్ట నివారణకు పూనుకున్నారు.