సరూర్నగర్లో సెంట్రల్ జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. జిఎస్టి కట్టని షాప్ను సీజ్ చేయడానికి వెళ్లిన వారిని దుకాణదారు, మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్ చేశాడు. అయితే ఆగమేఘాలపై స్పందించిన పోలీసులు కిడ్నాపర్లను వెంటాడి, అధికారులను రక్షించారు. కిడ్నాప్కు పాల్పడిన నిందితులు ఫిరోజ్, ముజీఫ్, ముషీర్, ఇంతియాజ్లను అరెస్ట్ చేశారు.
వీరిని పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. మరోవైపు జిఎస్టి అధికారుల కిడ్నాప్ విషయం తెలుసుకున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే తెలంగాణ డిజిపి అంజనీ కుమార్, సిపితో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె ఆదేశించారు. వివరాల్లోకి వెళితే, జిఎస్టి కేసులకు సంబంధించి మణిశర్మ, ఆనంద్ అనే సీనియర్ అధికారులు బుధవారం కృష్ణానగర్ ప్రాంతంలోని స్క్రాప్, వెల్డింగ్ షాప్ తనిఖీలకు వెళ్లారు.
ఆ వెంటనే గోడౌన్ నిర్వాహకులు జిఎస్టి అధికారుల ఐడీ కార్డులు లాక్కొన్నారు. ఆపై దాడి చేసి ఇన్నోవాలో కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లడంతో పాటు రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. వెంటనే మణిశర్మ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి 4.కిలోమీటర్ల దూరంలోనే కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు.
నలుగురి ని అదుపులోకి తీసుకోగా ఖయ్యూం అనే మరో నిందితుడు పరారీలో వున్నాడు. నిందితులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామ ని డిసిపి సాయిశ్రీ తెలిపారు.వారిపై ఇది వరకు ఏమైనా నేర చరిత్ర ఉందా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. కాగా, సెంట్రల్ జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేసినట్టు బుధవారం ఉదయం 10:30 నిమిషాలకు ఫిర్యాదు అందిందని వెల్లడించారు. ఫిర్యాదు అందిన వెంటనే అప్రమత్తమై తాము నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎల్బినగర్ డిసిపి సాయి శ్రీ తెలిపారు.
More Stories
ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్
తెలంగాణాలో 8,10 తేదీల్లో ప్రధాని ప్రచారం
పట్టభద్రుల ఎంఎల్సికి నోటిఫికేషన్