ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్

ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని తాము కోరుకొంటున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని తెలిపారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా మే 30 నుంచి వివిధ కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళ్లామని ఆయన చెప్పారు.
 
కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెబుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయని, బీజేపీకి అనుకూల వాతావరణం వస్తుందని సోము వీర్రాజు భరోసా వ్యక్తం చేశారు.
 
కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని చెబుతూ తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు మంచి స్పందన వచ్చిందని, ప్రజలు తమ కష్టాలు చెప్పుకుని కన్నీళ్లు పెడుతున్నారన్నారని వివరించారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ఏర్పాటుచేసేందుకు పనిచేస్తామని సోము వీర్రాజు తెలిపారు.
 
కాగా, కేంద్ర మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారని వీర్రాజు చెప్పారు. టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకుంటుందని ఎవరు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పెద్దలతో భేటీ అనంతరం చంద్రబాబు పొత్తుల అంశం ప్రస్తావించలేదని గుర్తు చేశారు.
చంద్రబాబు బీజేపీ నేతలు భేటీ, వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ పెద్దల విమర్శలు చేయడాన్ని ఎవరికి వారు అన్వయించుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 
ఇలా ఉండగా, వైసీపీకి బీజేపీ ఎప్పుడూ దగ్గరగా లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై పోరాడుతున్నామని తెలిపారు. తాము ఓ పార్టీకి దగ్గరగా ఉన్నామని చెప్పేందుకు కొంత మంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఒక అంశంలో అద్భుతంగా పనిచేశామని చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఎన్ని రోడ్లు వేశారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పగలదా? అని నిలదీశారు. ఏపీలో అభివృద్ధి కేవలం మోదీ చేసిన సాయమే అని వీర్రాజు స్పష్టం చేశారు. కేంద్రం ఇస్తున్న పథకాలకు వారి పేర్లు పెట్టుకోవడమే తప్ప రాష్ట్ర ప్రభుత్వంచేసిందేం లేదని ధ్వజమెత్తారు.

మరోవంక, జగన్ పై బీజేపీ పెద్దలు విమర్శలు చేశారని, మరి వారిపై చర్యలెప్పుడు తీసుకుంటున్నారని టీడీపీ బీజేపీని ప్రశ్నించింది. జగన్ ను విమర్శిస్తే సోము వీర్రాజుకు కోపమెందుకు వస్తుందని టీడీపీ నిలదీస్తుంది. దీనిపై సోము వీర్రాజు స్పందిస్తూ తన మాటలను వ్యతిరేకంగానో, అనుకూలంగానో చూడాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఏపీకి నష్టం జరుగుతుందని స్పందించామని పేర్కొన్నారు.

 
కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మధ్య వివాదంపై స్పందిస్తూ ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారన్న ఆయన వారిద్దరి మధ్య వివాదం కులపరంగా చూడకూడదని సూచించారు. వారిద్దరి మధ్య వివాదం రాజకీయంగా మాత్రమే చూడాలని చెప్పారు.