
సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, ఎస్సీ, మత్స్యకార, ఇతర వెనుకబడిన గ్రామాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీ నిర్మాణం, పురాతనాల పునరుద్ధరణ చేయడం అభినందనీయమని పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు ప్రశంసించారు. టీటీడీ ధర్మప్రచారం కోసం ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్టుపై రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయకండని విశ్వహిందూ పరిషత్ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు రాఘవులు సూచించారు.
తిరుమల అన్నమయ్య భవనంలో మీడియా సమావేశంలో శ్రీవాణి ట్రస్టుపై కొందరు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. సనాతన ధర్మంలో కీలకమైన దేవాలయం సమాజ సంక్షేమ కేంద్రమని ఆయన చెప్పారు. పురాతన కాలంలో ధర్మశాల, వేదశాల, భోజనశాల, యోగశాల, వైద్యశాల, మల్లశాల, గోశాలగా ఏడు ప్రధాన బాధ్యతలను నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధార్మిక సంస్థ టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు, విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తాము శ్రీవాణి ట్రస్టు అకౌంట్లను పరిశీలించామని, ఒక్క పైసా కూడా దుర్వినియోగమయ్యే అవకాశం లేదని రాఘవులు స్పష్టం చేశారు. ఎవరికైనా సందేహాలుంటే నేరుగా తిరుమలకు వచ్చి శ్రీవాణి ట్రస్టు రికార్డులను, ఖాతాలను పరిశీలించి నివృత్తి చేసుకోవచ్చని ఆయన సూచించారు.
అదేవిధంగా, శ్రీనివాసమంగాపురంలోని లలితా పీఠాధిపతి స్వస్వరూపానందగిరి స్వామి, కడపలోని బ్రహ్మంగారి మఠం మఠాధిపతి శ్రీ విరజానందస్వామి, హైదరాబాదుకు చెందిన హనుమత్ పీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద స్వామి మాట్లాడుతూ శ్రీవాణి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకునేందుకు తిరుమలలో ఈవోను కలిశామని తెలిపారు.
శ్రీవాణి ట్రస్టు ద్వారా ఎంతమంది దర్శించుకున్నారు, ఎక్కడెక్కడ ఆలయాలు నిర్మాణం జరుగుతోంది, ట్రస్టు నిధులు ఏయే బ్యాంకుల్లో ఉన్నాయి, వడ్డీ ఎంత వచ్చింది తదితర వివరాలను ఈవో తెలియజేశారని వారు చెప్పారు. ఈ వివరాలు పరిశీలించాక తమకు ఎంతో సంతోషం కలిగిందని, నిధులు దుర్వినియోగమయ్యే అవకాశమే లేదని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే హిందూ ధర్మం పట్ల భక్తుల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై భక్తులకు ఎవరికైనా సందేహాలుంటే నేరుగా టీటీడీని సంప్రదించి వివరాలు పొందవచ్చని సూచించారు. నిరాధారమైన ఆరోపణలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లలో ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో 8.25 లక్షల మంది శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు.
ఎన్నో నియమ నిబంధనల ప్రకారం ట్రస్టు ఏర్పాటు అవుతుందని, ఇంతమంది భక్తులకు రసీదులు ఇవ్వకపోతే మిన్నకుంటారా? అని ప్రశ్నించారు. విరాళానికి, దర్శన టికెట్కు వేరువేరుగా రసీదులు వస్తాయని చెప్పారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను పూర్తిగా తెలుసుకోవాలని, లేనిపక్షంలో కోట్లాది మంది భక్తులు విశ్వాసం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
More Stories
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్లో చీలిక!
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్