భారత్ ప్రతిష్ట మరింత పెంచుతున్న లోక్‌సభ

లోక్‌సభ విశిష్ట రీతిలో వ్యవహరించడం ద్వారా భారతదేశానికి ఉన్న ప్రజాస్వామ్య మాతృక గౌరవ ప్రతిష్ట మరింత పెరిగిందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతల స్వీకరించి నాలుగు సంవత్సరాలు సందర్భంగా సోమవారం ఓం బిర్లా ట్వీటు వెలువరించారు.

సభలో పలు కీలక నిర్ణయాలు సమిష్టిగా తీసుకున్నారని, ఇది మన దేశ ప్రజాస్వామ్యానికి గర్వకారణం పేర్కొన్నారు. 2019లో జూన్ 19న స్పీకర్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రపంచంలో ప్రజాస్వామిక దేశంగా భారత్‌కు గురుతర స్థానం ఉందని, దీనిని నిలబెట్టే క్రమంలో లోక్‌సభ వ్యవహరించడం ముదావహం ఆయన తెలిపారు.

ఓం బిర్లా పదవీకాలం 2024 జూన్ 24న ముగుస్తుంది. సభలోని అన్ని పక్షాల సభ్యులు వారి వారి అభిప్రాయాలను వ్యక్తికరించేందుకు అన్ని విధాలుగా అవకాశం ఉంటుందని స్పీకర్ తెలిపారు. ప్రజల మనోభావాలను వ్యక్తీకరించే బలీయమైన వేదికగా లోక్‌సభను తీర్చిదిద్దే క్రమంలో అంతా కలిసి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు.

17వ లోక్‌సభ లెజిస్లేటివ్ ప్రక్రియ సంతృప్తికరంగా ఉందని, సమావేశాల విషయంలో గణనీయ ప్రగతి సాధించిందని ఆయన తెలిపారు. గడిచిన 11సెషన్స్‌లలో మొత్తం 162 బిల్లులను ప్రవేశపెట్టగా వీటిలో అత్యధికం ఆమోదం పొందాయని పేర్కొన్నారు. తనకు ప్రధాని మోదీ, వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపిల నుంచి సరైన సహకారం అందిందని, ఇది తనకు గుర్తుండే విషయం అవుతుందని ఓం బిర్లా తెలిపారు.

కాగా, అంతకు మూడురోజుల క్రితం అంటే శుక్రవారం ముంబైలో జరిగిన లెజిస్లేటర్స్ కాన్ఫరెన్స్‌లో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా చట్టసభల తీరుతెన్నులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో కానీ, అసెంబ్లీల్లో కానీ తరచూ సభ్యులు వెల్‌లోకి దూసుకురావడం, కాగితాలు చింపి సభాధ్యక్షుడి వైపు విసిరివేయడం, ప్రత్యేకించి అసెంబ్లీలు, పార్లమెంట్‌ల సిట్టింగ్‌ల సంఖ్య తగ్గిపోవడం దారుణమని పేర్కొన్నారు.

 ప్రజాస్వామిక పరాకాష్ట వేదికల్లో క్రమశిక్షాణారాహిత్యం ఎంతవరకు సబబని ప్రశ్నించి ఆవేదన వ్యక్తం చేశారు. సభా మర్యాదలు దెబ్బతింటున్నాయని పేర్కొంటూ పార్టీలకతీతంగా అంతా కలిసి వీటిని నిలబెట్టాల్సి ఉంటుందని తెలిపారు.