గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన భార్య ఆస్తుల జప్తు

మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధినేత గాలి జనార్ధన్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన, ఆయన భార్యపై ఉన్న ఆస్తులు జప్తు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  గాలి జనార్ధన్ రెడ్డిపై నమోదైన మైనింగ్ అక్రమాల కేసుల విచారణలో భాగంగా కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన భార్య అరుణ పేరు మీద ఉన్న 124 ఆస్తుల్లో వందకు పైగా ఆస్తులను జప్తు చేసుకోవాలని ఆదేశించింది.  గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణ పూర్తయ్యే వరకు ఈ ఆస్తులు జప్తులోనే ఉంటాయని సీబీఐ స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది. 
గాలి జనార్ధన్ రెడ్డి ఆస్తులు జప్తు చేసేందుకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని గతంలో కర్ణాటక ప్రభుత్వాన్ని అప్పట్లో సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రశ్నించింది.
అయితే దానిపై తాజాగా కర్ణాటక ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేసింది. గాలి ఆస్తుల జప్తుపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గాలి జనార్ధన్ రెడ్డి ఆస్తులు జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది
 
గాలి జనార్ధన్ రెడ్డి కర్ణాటకతోపాటు తెలంగాణలోనూ ఇళ్లు, ఇంటి స్థలాలు, ఫ్లాట్లతో పాటు వివిధ ఆస్తులను కొనుగోలు చేసినట్లు సీబీఐ బృందం గుర్తించింది. అక్రమ గనుల తవ్వకాలతోనే గాలి జనార్ధన్ రెడ్డి ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్లు సీబీఐ అధికారులు కోర్టుకు విన్నవించారు.

కాగా, అక్రమ మైనింగ్ కేసుల్లో బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత జనార్దన్ రెడ్డి బెంగళూరుకే పరిమితమయ్యారు. బళ్లారికి వెళ్లకూడదంటూ ఆయనకు కోర్టు షరతులు విధించింది. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్రమ మైనింగ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన గాలి జనార్ధన్ రెడ్డి కర్ణాటక ఎన్నికలకు ముందు కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించారు.
ఈ పార్టీ తరఫున తాజా ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన భార్య అరుణ మాత్రం పరాజయం పాలయ్యారు.