ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నా… తమిళసై

ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నా… తమిళసై
తెలంగాణ గవర్నర్ గా తాను తాను ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నట్లు డా. తమిళి సై సౌందర్‌ రాజన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవడమే తన బలమని ఆమె స్పష్టం చేశారు.  హైదరాబాద్ లో కిమ్స్ కడిల్స్ ఉమెన్ హెల్త్ కార్యక్రమంలో  పాల్గొంటూ పరిస్థితులకు తగినట్టు స్పందించడం ద్వారా పని భారం లేకుండా చేసుకోవచ్చని ఆమె సూచించారు.
మహిళలు తమ సమస్యలు బయటకు చెప్పడానికి ముందుకు రావాలని ఆమె చెప్పారు. లైంగిక వేధింపులపై ఆడపిల్లలకు బాల్యం నుంచి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ”మహిళలు తమ సమస్యలు చెప్పేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. బాల్యం నుంచే ఆడపిల్లలకు లైంగిక వేధింపులపై అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు కాస్త సమయం కేటాయిస్తే ఆడపిల్లలు అనేక సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది” అని ఆమె తెలిపారు. 
ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరగాలని చెబుతూ ప్రధాని మోదీ తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ఉపయోగపడతాయని గవర్నర్ తమిళి సై తెలిపారు.  ఈ పథకాన్ని రాజకీయాలకు అతీతంగా అమలుచేయాలని ఆమె హితవు చెప్పారు. కాగా, రాష్ట్రంలో రెండేళ్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనకు అందుబాటులో లేరని డా. తమిళిసై తెలిపారు.

ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతూ గతంలో సీఎం కేసీఆర్ తో మాట్లాడి ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలయ్యేలా చేశామని ఆమె గుర్తు చేశారు. డబ్బును లెక్కబెడుతున్నాం కానీ క్యాలరీలు లెక్కించడంలేదని ఆమె విచారం వ్యక్తం చేశారు.

ఒక్క మహిళ విజయం 1000 మంది పురుషుల విజయంతో సమానమని గవర్నర్ తమిళిసై తెలిపారు. జీవితంలో సవాళ్లు ఎదుర్కోవాలంటే సంపూర్ణ ఆరోగ్యం అవసరమని చెబుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఎంతో అవసరమని ఆమె స్పష్టం చేశారు.

మెడికల్ షాపుల్లో ధరలు చూసి రోగులకు మరింత ఆరోగ్యం పాడవుతుందని గవర్నర్ హెచ్చరించారు. జనరిక్​ మందులను ప్రభుత్వం చాలా తక్కువ ధరకు అమ్ముతున్నట్లు ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ పాటు కీర్తి రెడ్డి ఫౌండేషన్ అధ్యక్షురాలు కీర్తి రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో నిర్వహించిన వైద్య శిబిరంలో పలువురికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కిట్లను పంపిణీ చేశారు