ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర గణనీయంగా పెంపు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2023-24 మార్కెటింగ్ సీజన్‌ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని పెంచారు. వరి క్వింటాలుకు రూ.143 చొప్పున, మూంగ్ దాల్ క్వింటాలుకు రూ.803 చొప్పున, రాగులు క్వింటాలుకు రూ.268 చొప్పున పెంచారు.

మంత్రివర్గ సమావేశం వివరాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్  మీడియాకు వివరించారు. 2023-24 మార్కెటింగ్ సీజన్‌ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను పెంచినట్లు తెలిపారు. పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు, రైతులకు సరసమైన ధర లభించేలా చూడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఎంఎస్‌పీని రికార్డు స్థాయిలో పెంచినట్లు తెలిపారు. వరికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.2,040 నుంచి రూ.2,183కు పెంచినట్లు తెలిపారు. మూంగ్ దాల్ ఎంఎస్‌పీని క్వింటాలుకు రూ.7,755 నుంచి రూ.8,558కి పెంచారు.

మణిపూర్ హింసాకాండ, బాలాసోర్ రైలు దుర్ఘటనలలో ప్రాణాలు కోల్పోయినవారికి మంత్రివర్గం సంతాపం తెలిపిందని గోయల్ తెలిపారు.

* సాధారణ వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర 2022-23లో రూ.2,040 ఉండేది. దీనిని 2023-24 కోసం రూ.2,183కు పెంచారు. అంటే రూ.143 పెంచారు. గ్రేడ్ ఏ వరి క్వింటాలుకు ఎంఎస్‌పీని రూ.2,060 నుంచి రూ.143 పెంచి, రూ.2,203 చేశారు.

* హైబ్రిడ్ జొన్నలు క్వింటాలుకు ఎంఎస్‌పీని రూ.2,970 నుంచి రూ.210 పెంచి, రూ.3,180 చేశారు.

* రాగులు (చోళ్లు) క్వింటాలుకు రూ.3,578 నుంచి రూ.3,846కు పెంచారు. అంటే రూ.268 పెరిగింది.

* వేరుశనగలు (పల్లీలు) క్వింటాలుకు రూ.527 పెంచి, రూ.6,377 చేశారు. అంతకుముందు ఇది రూ.5,850 ఉండేది.

 *  పెసర పంటకు అత్యధికంగా కనీస మద్దతు ధరను పెంచారు. పెసర పంట ఎంఎస్పీని ఒక క్వింటాల్ పై సుమారు 10.4% పెంచారు. తాజా పెంపుతో పెసర క్వింటాల్ కనీస మద్దతు ధర రూ. 8,558 కి చేరింది. గత ఖరీఫ్ సీజన్ లో అది రూ. 7,755 గా ఉంది.

పంటలకు కనీస మద్దతు ధరతోపాటు వివిధ నిర్ణయాలకు కూడా కేంద్ర కేబినేట్ సమావేశాల్లో పచ్చజెండా ఊపారు. ఢిల్లీలోని హుడా సిటీ సెంటర్‌ నుంచి గురుగ్రామ్‌లోని సైబర్‌ సిటీకి మెట్రో అనుసంధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 27 స్టేషన్ల నుంచి 28.50 కిలోమీటర్ల పొడవు ఈ మెట్రో నిర్మాణం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.5452 కోట్లుగా అంచనా వేశారు. ఈ మెట్రో ప్రాజెక్ట్ మంజూరు అయినప్పటి నుంచి నాలుగేళ్లలో పూర్తి చేయాలని సంకల్పం పెట్టుకున్నారు.