కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం సీట్లు మగాళ్లకే

దేశంలో ఎక్కడైనా ఆర్టీసీ బస్సులలో ఆడవారికి కొన్ని సీట్లు కేటాయించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ సీట్లలో కూర్చున్న మగవారు ఆడవారు రాగానే లేచి నిలబడటం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. పైగా, ఆడవాళ్లకు కేటాయించిన సీట్ల వెనుక ‘స్త్రీలను గౌరవిద్దాం.. స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం’ అనే కొటేషన్‌ సైతం రాసి ఉంటుంది.
 
కానీ ఇప్పుడు కర్ణాటకలో పురుషులకు బస్సుల్లో 50 శాతం సీట్లను కేటాయిస్తున్నారు. ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోకుండా, మగాళ్లకు కోపం రాకుండా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యగా భావిస్తున్నారు. ఇటీవల అక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా

తాము అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. ఏసీ, లగ్జరీ బస్సులను మాత్రం దీని నుంచి మినహాయించింది.

జూన్ 11న కర్ణాటక వ్యాప్తంగా ఈ పథకం మొదలవుతుంది. దీనికి ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి సానుకూల స్పందన వస్తోంది. కానీ ఆర్టీసీకి మాత్రం నష్టాలు రావడం ఖాయంగా ఉంది. దీంతో మగాళ్లు డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి, బస్సుల్లో 50 శాతం సీట్లను పురుషులకు కేటాయిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

మన దగ్గర ఆర్టీసీ బస్సుల సీట్ల వెనుక ఈ సీటు స్త్రీలకు కేటాయించబడింది.. అని రాసినట్లు ఇప్పుడు కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో.. పురుషులకు కేటాయించిన సీట్లకు స్టిక్కర్లను అతికిస్తారట. బస్సులో పురుషులు లేకుంటే.. ఆ సీట్లు ఖాళీగా ఉంటే మహిళలు వాటిలో కూర్చోవచ్చు.
 
కానీ ఒకవేళ పురుషులు వస్తే మాత్రం ఆ సీటును ఖాళీ చేసి వారిని కూర్చోనివ్వాలి. ఈ పథకం అమలు చేయడానికి కర్ణాటక ప్రభుత్వానికి ఏడాదికి రూ.4,220 కోట్లు అవసరమని అంచనా. అంతే కాదు.. కర్ణాటక ఆర్టీసీ కొత్తగా 4 వేలకుపైగా బస్సులను సమకూర్చుకోవడంతోపాటు.. దాదాపు 14 వేల మంది సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది.