తెలుగు రాష్ట్రాల్లో రెండు సూపర్‌ఫాస్ట్ రైల్వే లైన్లు

దేశంలో హైస్పీడ్ రైళ్ల రంగప్రవేశానికి అనువుగా పటిష్ఠమైన ట్రాక్ లను నిర్మించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం – విజయవాడ – తెలంగాణలోని శంషాబాద్ మధ్యలో మొదటిది, విశాఖపట్నం – విజయవాడ – కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ సర్వే కోసం రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది.

ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే పూర్తయి, సానుకూల నివేదిక ఇస్తే ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది. ఈ రైల్వే లైన్లకు సంబంధించి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పలుమార్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి, లేఖలు సమర్పించారు.

ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు తాజాగా ఈ రెండు రూట్లలో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో (గరిష్టంగా గంటకు 220 కి.మీ వేగంతో ప్రయాణించేలా) రైల్వై లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయనున్నారు.

 
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం అనుసంధానతను మెరుగుపరిచే దిశగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల  అభివృద్ధి, వై-ఫైలు, రూ.30వేల కోట్ల విలువైన డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను కేంద్రం తెలుగు రాష్ట్రాలకు అందించింది.
 
వీటికి అదనంగా తెలంగాణలో వ్యాగన్ తయారీ, ఓవర్‌హాలింగ్ కేంద్రాన్ని, ఎంఎంటీఎస్ (రెండోదశ), సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, చర్లపల్లి టర్మినల్ వంటి ప్రాజెక్టులను కేంద్రం చేపడుతున్న సంగతి తెలిసిందే.