ఉత్తరాఖండ్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన మోదీ

ఉత్తరాఖండ్‌ లోని డెహ్రాడూన్‌ను దేశ రాజధాని న్యూఢిల్లీతో కలుపుతున్న తొలి సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. వివిధ మార్గాల నుంచి ఢిల్లీని కలుపుతున్న ఆరవ వందే భారత్ రైలు ఇది.
 
ఉత్తరాఖండ్ కు ఇదొక గొప్ప అవకాశం అని ప్రధాని పేర్కొన్నారు. ముక్కోణపు పర్యటన ముగించుకుని తాను ఇప్పుడే తిరిగి వచ్చానని, ప్రపంచం మొత్తం భారత్ వైపు ఎంతో ఆశతో చూస్తోందని చెప్పగలనని పేర్కొన్నారు. ప్ర‌పంచ ప‌ర్యాట‌కులు భార‌త్ ని సంద‌ర్శించి ఆ దేశాన్ని చూసి అర్థం చేసుకోవాల‌ని కోరుకుంటున్నాన‌ని చెప్పారు.
 
ఉత్తరాఖండ్ లో ప్రారంభించిన వందే భారత్ రైలు గురించి మాట్లాడుతూ, ఇది దేశ రాజధానిని వేగంగా కలుపుతుందని, ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ఢిల్లీ- డెహ్రాడూన్ మధ్య నడిచే ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు దేశ రాజధానిని వేగంగా కలుపుతుంది. ఈ రైలుతో ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. రైలులోని సౌకర్యాలు ఈ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయ‌ని వివరించారు.
 
ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీకి అజ్మీర్, వారణాసి, కత్రా, భోపాల్, అంబ్ అందౌరాల ప్రాంతాలను కలుపుతూ వందేభారత్ రైళ్లతో అనుసంధానించారు. కాగా ఉత్తరాఖండ్ మొదటి వందే భారత్ సెమీహైస్పీడ్ రైలు భారతదేశంలో 18వది.  ఉత్తరాఖండ్ తొలి వందేభారత్ రైలు డెహ్రాడూన్ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ వరకు మొదటి పరుగును ప్రారంభించింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు స్వదేశీయంగా తయారు చేయబడింది.
ఇందులో ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్నాయి.  ప్రత్యేకించి ఉత్తరాఖండ్‌కు ప్రయాణించే పర్యాటకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాల కొత్త శకాన్ని తెలియజేస్తాయి. కవాచ్ టెక్నాలజీతో సహా అధనాతన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

ఈనెల 29 నుంచి ఢిల్లీ-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు సాధారణ కార్యకలాపాలు ప్రారంభ మవుతాయి. కేవలం 4 గంటల 45 నిమిషాల ప్రయాణ సమయంతో 302 కి.మీ. ప్రయాణించవచ్చు. బుధవారం మినహా వారంలోని అన్ని రోజులలో నడుస్తుంది. ఢిల్లీ-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టిక్కెట్ ధర ఏసీ చైర్ కార్: రూ.1,065, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్: రూ. 1,890.

గత వారం ఒడిశా నుంచి తొలి వందే భారత్‌ ప్రారంభమైంది. పూరీ-హౌరా మధ్య నడుస్తుంది. హౌరా-పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మే 18న ప్రధాని నరేంద్ర మోదీ పూరీ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. మే 20న వాణిజ్య సేవలను ప్రారంభించారు.