తిరుమలలో మరోసారి మద్యం కలకలం

తిరుమల కొండపై మరోసారి మద్యం  కలకలం రేపింది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండపై మరోసారి అపచారం చోటు చేసుకుంది. తాజాగా తిరుమలలో మరోసారి మద్యం బాటిల్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న హెచ్‌టి కాంప్లెక్స్‌ లోని షాప్ నెం.78లో 5 మద్యం బాటిల్స్‌ను టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దుకాణదారుడు తన స్నేహితులతో సంబరాలు చేసుకుంటుండగా టిటిడి అధికారులు సోదాలు నిర్వహించడంతో మద్యం బాటిల్స్ పట్టుబడ్డాయి. దీంతో అధికారులు షాప్‌ను సీజ్ చేసి దు కాణదారుడిని అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌టీ కాంప్లెక్స్‌లో వ్యక్తిపై హత్యాయత్నం ఘటన మరువకముందే అదే కాంప్లెక్స్‌లో మద్యం సీసాలు పట్టుబడడం కలకలం సృష్టిస్తోంది. తిరుమలలో నిఘా కరువైందంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న దుకాణందారుడు రాత్రి షాపులోనే మద్యం పార్టీ చేసుకుంటుండగా సమాచారం  అందుకున్న విజిలెన్స్ సిబ్బంది దుకాణంపై దాడి చేయగా.. ఐదు మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. అలాగే మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజులుగా వారు తిరుపతి నుంచి తిరుమలకు మద్యం బాటిళ్లు తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం.

గతంలో కూడా ఆ షాపు యజమానిపై పలు కేసులు నమోదయినట్లు తెలియవచ్చింది. ఆదివారం ఉదయం టీటీడీ విజిలెన్స్, రెవెన్యూ అధికారులు ఆ షాప్‌‌ను సీజ్ చేశారు. తిరుమల కొండపై మద్యం, మాంసం, గుట్కాలను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. పవిత్రమైన తిరుమల కొండపై ఇలాంటి అక్రమాలకు అడ్డుకడ్డ వేయాలని కోరుతున్నారు. తిరుమల కొండపైకి మద్యం, గంజాయి తరిలిస్తుంటే విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

కాగా తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. వైసీపీ జెండాతో ఓ వాహనం తిరుమలకు వచ్చింది. ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు అంటూ జీపుపై జెండా ఉంది.  తిరుమలకు రాజకీయ జెండాలు, కరపత్రాలు, వ్యక్తుల ఫొటోలు, చిహ్నాలను తీసుకురావడం నిషేధం. అలా ఎవరైనా వస్తే వారిని అలిపిరిలోని చెక్‌పాయింట్‌లోనే భద్రతా సిబ్బంది తనిఖీ చేసి అడ్డుకుంటారు.  అయితే, వైసీపీ జెండాతో తిరుమల రోడ్లపై తిరుగుతున్నప్పటికీ విజిలెన్స్‌ అధికారులు గుర్తించకపోవడం గమనార్హం.