కేసీఆర్ ను ఓడించే సత్తా బీజేపీకే రేవంత్

కర్ణాటకలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తెలంగాణలో సహితం బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ నేతలంతా తిరిగి కాంగ్రెస్ లో చేరాలంటూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపును మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొట్టిపారేసారు. పైగా, తాను కూడా బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించారు.

రాష్ట్ర ప్రజలకు బిజెపిపై నమ్మకం ఉందని చెబుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ను ఓడిస్తుందని దీమా వ్యక్తం చేశారు. బీజేపీలో తానే కాదు..మరెవరూ కూడా పార్టీని వీడటం లేదని తేల్చి చెప్పారు.  సీఎం కేసీఆర్ ను  ఓడించే సత్తా బీజేపీకే ఉందని చెబుతూ కాబట్టి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరాలని సూచించారు.  కాంగ్రెస్ లోని మిగతా నేతలు కూడా బీజేపీలో చేరాలని ఆహ్వానం పలికారు.

బీజేపీ  అంటే సెక్యులర్ పార్టీ అని పేర్కొంటూ అందుకే  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి ని కూడా బీజేపీలో చేరాలని కోరామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీయే మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పార్టీ అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. మతానికో కోడ్ ఉండాలని కాంగ్రెస్ అంటోందని, భారత్ జోడో యాత్ర చేపట్టిన వారు కాశ్మీర్‌కు వేరే కోడ్ ఉండాలని అనడం ఏమిటని విమర్శించారు.

కాంగ్రెస్ గతంలో బలవంతంగా ఏపీ, తెలంగాణలను కలిపిందని గుర్తు చేశారు.   రెండు రాష్ట్రాలను బలవంతంగా కలిపిన కాంగ్రెస్ ఆ తర్వాత  రాజకీయ అవసరాల కోసం మళ్లీ విడదీసిందని విమర్శించారు. కాంగ్రెస్  రాజకీయ అవసరాల కోసం ఏదైనా చేస్తుందని ధ్వజమెత్తారు.  వారికి ఒక పాలసీ, సిద్దాంతం అంటూ ఏది లేదని మండిపడ్డారు.

బీజేపీపై మతతత్వ పార్టీ ముద్ర వేస్తున్నారని విమర్శించారు. తమ గుజరాతీ పార్టీ అని అంటున్నారని, అయితే ఆర్ఎస్ఎస్ పుట్టిందే తెలంగాణలో అని చెప్పారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పుడు అరెస్ట్ అనేది తమ చేతిలో లేదని స్పష్టం చేశారు. కవిత లిక్కర్ కేసు విచారణను దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయని చెబుతూ  రాజకీయ పార్టీ ఎవరిని అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. 

ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్నొళ్లంతా తెలంగాణ వ్యతిరేకులే అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్లను దొంగలన్న కేసీఆర్ ఇప్పుడు అవసరం కోసం వారిని పొగుడుతున్నారని డాలయ్యబట్టారు.   బీజేపీ ఎప్పుడూ ఆంధ్రా వారిని విమర్శించలేదని గుర్తు చేశారు. బీజేపీకి కర్ణాటకలో గతంలో ఎన్ని ఓట్లు వచ్చాయో, ఇప్పుడు కూడా అన్నే ఓట్లు వచ్చాయని చెప్పారు.

రాష్త్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చాలని తామంతా ఢిల్లీలో ఏదో ప్రయత్నం చేస్తున్నట్లు వస్తున్న కథనాలను విశ్వేశ్వర్ రెడ్డి కొట్టిపారేశారు. పార్టీలో మార్పు అనగానే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలనడం కాదని తెలిపారు. పార్టీలో ఉన్న ఇతర సమస్యలపై అమిత్ షాకు వివరించినట్లు చెప్పారు.