ప్లెక్సీలు పెట్టుకుంటే దేశ్ కీ నేత కాలేరు

దేశ్ కీ నేత అని ఫ్లెక్సీలు పెట్టించుకుంటే సీఎం కేసీఆర్ దేశానికి నేత కాలేరని, ప్రజలు గుర్తిస్తేనే అవుతారని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.  కేసీఆర్ పరిస్థితి ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికెగిరిన్నట్లుందని అంటూ మహారాష్ట్రలో కొంత మంది పనికిమాలిన వాళ్లకు ఫోన్లు చేస్తూ పార్టీలో చేర్చుకుంటూ ప్రధానిని విమర్శిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కల్వకుంట్ల కుటుంబానికి పొద్దున లేస్తే ప్రధాని మోదీని విమర్శించడమే పనని మండిపడ్డారు. రైతు బంధు కింద ఎకరాకు ఏటా రూ.10 వేలిస్తున్నామని డబ్బా కొట్టుకోవడం తప్ప బీఆర్ఎస్ సర్కారు రైతులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. చేతికొచ్చిన పంట వర్షానికి కొట్టుకుపోయినా రైతులకు ప్రభుత్వ సహకారం లేదని విమర్శించారు.

రాష్ట్రాన్ని సలహాదులకు వదిలేసి మహారాష్ట్రలో బీఆర్ఎస్ బ్రాంచి పెట్టుకోవడం ఏంటని, ఇక్కడి రైతులు, యువకులు ఏం కావాలని ప్రశ్నించారు. ప్రగతి భవన్ బుల్లెట్ ప్రూఫ్ అద్దాల నుంచి కేంద్రం మీద రాళ్లు వేస్తే అవి మీ మీదే పడతాయని చురకలంటించారు.  కేసీఆర్ రోజూ చెప్పే రైతు బంధు కంటే తామిచ్చే ఎరువుల సబ్సిడీయే ఎక్కువని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఎకరాకు ప్రతి ఏటా రూ. 18, 254 ఇస్తున్నామని తెలిపారు. తామిచ్చే ఎరువుల సబ్సిడీ కౌలు రైతులకు కూడా అందుతోందని, అయితే కేసీఆర్ రైతు బంధు ధనికులకు మాత్రమే అందుతోందని గుర్తు చేశారు.

రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు ప్రధాని వస్తే రారు కానీ పొద్దున లేస్తే నాందేడ్ కు వెళుతున్నారని విమర్శించారు. ఉచిత ఎరువలిస్తామని చెప్పి మోసం చేసి కేసీఆర్ రైతులకు వెన్నుపోటు పొడిచాడని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్రలో ఒక వార్డ్ మెంబర్ గెలిచినందుకే బీఆర్ఎస్ నేతలంతా తెగ సంబరపడిపోతున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

మోదీ  ప్రధాని అయినప్పటి నుంచి కనీస మద్దతు ధరను వంద శాతం పైగా పెంచామని చెప్పారు. బీఆర్ఎస్ గెలిచిన మొదటి రోజే దళిత సీఎం హామీని తుంగలో తొక్కి, ఇప్పటివరకు ఎన్నో హామీలిచ్చి విస్మరించారని కిషన్ రెడ్డి విమర్శించారు.  కర్ణాటక ఎన్నికల‌ ప్రభావం ఇటు తెలంగాణలో ఏమాత్రం ఉండదని తేల్చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎలాంటి భవిష్యత్తు లేదని పేర్కొంటూ బీఆర్ఎస్‌కు కేవలం బీజేపీనే ప్రత్యామ్నాయమని తేల్చి చెప్పారు.