సాంకేతికత సాధికారికత కోసమే, ఆధిపత్యం కోసం కాదు

సాంకేతికత సాధికారికత కోసమే, ఆధిపత్యం కోసం కాదు

భారతదేశం సాధికారతకు సాంకేతికతను వాడుకుంటుంది. అంతేకానీ ఆధిపత్యం చాటుకునేందుకు కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పోఖ్రాన్‌లో 1998 నాటి అణుపరీక్షల ఘట్టం అత్యంత కీలక విషయం అని ప్రధాని కొనియాడారు. భారతదేశ చరిత్రలో ఇది ఓ గణనీయ కాలంగా నిలుస్తుందని చెప్పారు. అందుబాటులోకి వచ్చే సాంకేతిక పరిజ్ఞానం దేశ ప్రగతికి సరైన విధంగా వినియోగించుకుంటేనే దానికి సార్థకత దక్కుతుందని తెలిపారు.

అంతేకాని దీనిని ప్రాతిపదికగా చేసుకుని ఇతరులను బెదిరించేందుకు దిగితే అది అనుచితం అవుతుందని ప్రధాని చెప్పారు. నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పోఖ్రాన్ అణుపరీక్షల రజతోత్సవం కూడా ఇదే రోజు అయిన దశలో ప్రధాని అప్పటి అణుపరీక్షల నిర్వహణ దేశానికి గర్వకారణం అని పేర్కొన్నారు.

అప్పటి ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఈ పరీక్షలు జరిగాయని, ఇది భారతదేశ సాంకేతిక శాస్త్రీయ సమర్థతను చాటిందని తెలిపారు. అంతేకాకుండా ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రతిష్ట ఇనుమడించిందని తెలిపారు. అటల్‌జీ మాటల్లోనే చెప్పాలంటే ‘ మనం మన పయనాన్ని ఎప్పుడూ నిలిపివేయలేదు. మార్గమధ్యంలో తలెత్తే సవాళ్లకు తలొగ్గలేదు, వెనుదిరగలేదు’ అని గుర్తు చేశారు.

నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా ప్రధాని మోదీ  లిగో ఇండియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇటీవల కాలంలో భారత్ శాస్త్ర, సాంకేతిక రంగాలలో సాధించిన ప్రగతిని వివరించే ప్రదర్శనను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో రూ 5,800 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్ట్ లకు శ్రీకారం చుట్టారు.

అరుదైన భూ ఖనిజాలతో రూపొందించే శాశ్వత మాగ్నెట్లను జాతికి అంకితం చేశారు.  ఒడిషాలోని జత్నిలో ఏర్పాటు అయ్యే హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్, పరిశోధనా కేంద్రానికి పునాదిరాయి వేశారు. ముంబైలోని టాటా స్మారక ఆసుపత్రి ప్లాటినం జూబ్లీ బ్లాక్ కూడా శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రులు రాజనాథ్ సింగ్, డా. జితేందర్ సింగ్ కూడా పాల్గొన్నారు.