స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుళ్ల కలకలం

స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుళ్ల కలకలం
సిక్కుల పవిత్ర యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచిన అమృత్‌సర్‌ లోని స్వర్ణ దేవాలయం సమీపంలో వరుస పేలుడు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వర్ణ దేవాలయానికి సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో మొదటసారి బాంబు పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
 
కాగా, 24 గంటల వ్యవధిలో అదే ప్రాంతంలో తాజాగా మరో పేలుడు సంభవించింది.  స్వర్ణ దేవాలయంకు వెళ్లే మార్గంలోని హెరిటేజ్‌ స్ట్రీట్‌ లో సోమవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. స్వర్ణ దేవాలయానికి వెళ్లే మార్గంలోని దర్బార్‌ సాహిబ్‌ వద్ద ఈ పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు.
పేలుడులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. సమాచారం అందిన వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు, బాంబు స్క్యాడ్, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.

కాగా, వరుస పెలుళ్లతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒకే ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో రెండు పేలుళ్లు జరగడంతో ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు వెల్లడించారు. పేలుడు ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోందని.. స్థానికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.