ఏప్రిల్ లో గరిష్ట స్థాయిలో విదేశీ పెట్టుబడులు

భారతదేశం ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ జోరందుకుంటున్నాయి. ఏప్రిల్ నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) గరిష్ట పెట్టుబడిని పెట్టారు. గత నెలలో దాదాపు రూ.11,631 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.  విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం ఇది వరుసగా రెండో నెల కావడం గమనార్హం.

ఐటీ రంగంలోని టెక్ దిగ్గజాలలో భారీ అమ్మకాలు జరిగినప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లు మాత్రం ఆసక్తి చూపించారు. సెన్సెక్స్, నిఫ్టీ 50 రెండూ ఏప్రిల్‌లో మెరుగైన పనితీరును కనబరిచాయి.  ఎన్‌ఎస్‌డిఎల్ డేటా ప్రకారం, ఎఫ్‌పిఐలు ఏప్రిల్‌లో రూ.11,631 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. అంతకుముందు మార్చి నెలలో రూ.7,936 కోట్ల ఎఫ్‌పిఐ పెట్టుబడులు వచ్చాయి. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు రూ.126 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

ఇటీవల కాలంలో భారత్‌లో ఎఫ్‌పిఐలు తమ పెట్టుబడుల వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇన్వెస్టర్లు స్టాక్స్‌ను విక్రయించగా, గత రెండు నెలలుగా కొనుగోలుదారులు పెరుగుతున్నారు.  ఏప్రిల్‌లో సెన్సెక్స్ దాదాపు 2,121 పాయింట్లు (3.60 శాతం) లాభపడగా, నిఫ్టీ 705 పాయింట్లు(4.06 శాతం) లాభపడింది. ఫిబ్రవరి చివరి నాటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 82.94 కనిష్ట స్థాయికి చేరగా, ఇప్పుడు ఇది 81.75కి దిగొచ్చింది.