కర్ణాటక ఎన్నికలకు సహకరించమని ఆరు రాష్ట్రాలను కోరిన సీఈసీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను భారత ప్రధాన ఎన్నికల కమీషన్  (సీఈసీ) ఆదేశించింది. ఈ మేరకు కర్నాటకతో సహా ఆరు దక్షిణాది రాష్ట్రాల సీఎస్​లు, డీజీపీలతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పోలింగ్​కు సంబంధించి చేసిన ఏర్పాట్లను సమీక్షిస్తూ  ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటర్లను ప్రభావితం చేసేందుకు సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్ తదితరాలను అరికట్టేందుకు చెక్‌‌పోస్టులు, పెట్రోలింగ్‌‌ను పెంచాలని అధికారులు సీఈసీ అదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌‌లు, మొ బైల్ స్క్వాడ్‌‌లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు.

ముఖ్యంగా పోలింగ్‌‌కు ముందు చివరి 72 గంటలు సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో  కర్నాటకలోకి వచ్చే అవకాశం  ఉన్నందున నిఘా ఉంచాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో నగదు, అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర వస్తువుల తరలింపును నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రధాన కార్యదర్శి  శాంతికుమారి ఎన్నికల సంఘం సభ్యులకు వివరించారు.

కర్నాటక ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నదని ఆమె తెలిపారు. ఆ రాష్ట్రంలో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తామని సీఎస్​ హామీ ఇచ్చారు. కర్ణాటక సరిహద్దు జిల్లాల నుంచి తెలంగాణలోకి వ్యక్తుల రాకపోకలు, సామగ్రి తరలింపును పర్యవేక్షించడానికి పోలీస్, ఎక్సైజ్ శాఖల చెక్ పోస్ట్‌‌ లు పెంచుతున్నామని ఆమె వివరించారు.

 సమావేశంలో డీజీపీ అంజనీకుమార్, సీఈవో వికాస్ రాజ్, సెక్రటరీ జీఏడీ శేషాద్రి, హోంశాఖ కార్యదర్శి జితేందర్, అదనపు డీజీ స్వాతి లక్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఈవో ముఖేష్ కుమార్ మీనా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ తదితరులు పాల్గొన్నారు.