నిఘా పెంపుకు సిద్దమవుతున్న నాట్‌గ్రిడ్‌

విమానాశ్రయాలు, రైల్వేలు, పాన్‌ రికార్డులు, బ్యాంకులు, పాస్‌పోర్టులు, క్రైమ్‌, క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌ (సిసిటిఎన్‌ఎస్‌), టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లు, వాహనాల రిజిస్ట్రేషన్‌ డేటా, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్‌), ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ (ఒఎస్‌ఐఎన్‌టి), కార్పొరేట్‌ వివరాలు, ఇలా మరే ఇతర వివరాలైనా సరే, రియల్‌ టైమ్‌ సమాచారాన్ని  అందించడం ద్వారా వ్యక్తుల, ఇతర సంస్థలపై నిఘాను పెంచడానికి జాతీయ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌ (నాట్‌గ్రిడ్‌) సిద్ధంగా వుందని తెలుస్తున్నది.
 
కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాట్‌గ్రిడ్‌ అభివృద్దిపరిచిన కేంద్రీకృత డేటాబేస్‌, ఆర్థిక, ప్రభుత్వ వ్యవహారాలకు చెందిన ఒక వ్యక్తి లేదా కంపెనీలకు సంబంధించిన అన్ని  డిజిటల్‌ వివరాలను తీసుకుంటుంది. ఎక్కడన్నా అనుమానాస్పద లావాదేవీలను గుర్తించగల లక్షణాన్ని  కూడా ఇది అంతర్గతంగా కలిగివుందని చెబుతున్నారు.
 
ప్రైవేట్‌, ప్రభుత్వ, అధికార డేటాను ఉపయోగించి జరిపే ఈ నిఘా కార్యకలాపాలు రెండు దశల్లో అమలవుతాయి. మొదటి దశలో నాట్‌గ్రిడ్‌, సమాంతర టెలికం కంపెనీలతో, ఎన్నికల కమిషన్‌, ఎయిర్‌లైన్స్‌ డిజిటల్‌ డేటాబేస్‌లతో ఏకీకృతమవుతుంది. వీటి మధ్య సంబంధాలు నెలకొన్న తర్వాత, ఒక వ్యక్తి లేదా సంస్థకు సంబంధించిన పూర్తి, సమగ్ర వాస్తవిక సమాచారాన్ని 39 కేంద్ర, రాష్ట్ర సంస్థలకు నాట్‌గ్రిడ్‌ అందచేయగలుగుతుంది.
 
పాన్‌ రికార్డులు, క్రెడిట్‌ కార్టు వివరాలతో సహా బ్యాంక్‌ సదుపాయాలు, పాస్‌పోర్టులు, కంపెనీ వివరాలు, రైల్వే సరుకు రవాణా, ఇమ్మిగ్రేషన్‌, వాహనాల రిజిస్ట్రేషన్‌, ఎన్‌పిఆర్‌ డేటా ఇవనీు ఇప్పటికే ఒక క్లిక్‌తో కేంద్ర, రాష్ట్ర సంస్థలకు అందుబాటులో ఉన్నాయి.
 
ఇక రెండవ దశలో, డేటా విశ్లేషకులు, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి వెబ్‌ బేస్డ్‌ అప్లికేషన్లను సమన్వయ పరిచి, సంపూర్ణమైన డిజిటల్‌ సమాచారాన్ని జాతీయ భద్రతా ప్రయోజనాలకు అందించగలుగుతారని తెలుస్తున్నది. కేవలం అధీకృత ప్రభుత్వ కస్టమర్‌కు మాత్రమే ఈ డేటా అందుబాటులో వుంటుందని అధికారులు చెబుతున్నారు.