బైజూస్‌ సీఈవో నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

బైజూస్‌ సీఈవో నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ సిఇఓ రవీంద్రన్ కార్యాలయం, ఇంట్లో సోదాలను బెంగళూరులో నిర్వహించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంవ డైరెక్టరేట్ శనివారం వెల్లడించింది. విదేశీ మారకం ఉల్లంఘన కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించినపుడు కీలక పత్రాలు, డిజిటల్ డాటాను స్వాధీనం చేసుకున్నట్లు ఇడి తెలిపింది.
 
ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) నిబంధనల కింద ఇటీవల రవీంద్రన్‌కు చెందిన రెండు వ్యాపార కార్యాలయాలు, ఒక నివాస గృహంలో సోదాలు నిర్వహించినట్లు ఇది ఒక ప్రకటనలో తెలిపింది.  డిజిటల్ డేటాను కూడా ఈడీ జప్తు చేసింది. ప్రైవేట్ వ్యక్తుల నుంచి వచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా బైజూస్ సిఇఓప చర్యలు తీసుకున్నట్లు ఇడి తెలిపింది.
 
రవీంద్రన్ బైజూకు అనేక సమ్మన్లు జారీచేసినప్పటికీ ఆయన ఇడి ఎదుట హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఇడి తెలిపింది.
బైజూస్‌కు చెందిన థింక్ అండ్ లర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2011 నుంచి 2023 మధ్య కాలంలో రూ. 28,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) స్వీకరించిందని తమ దర్యాప్తులో తేలినట్లు ఇడి పేర్కొంది. 
అదే కాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పేరిట వివిధ విదేశీ సంస్థలకు రూ. 9,754 కోట్లను ఈ కంపెనీ చెల్లించిందని ఇడి వివరించింది.

మరోవైపు ఏపీలో బైజూస్‌పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ఆసక్తి చూపుతూ వస్తున్నది. బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. విద్యార్ధులకు కంటెంట్ ఉచితంగా ఇస్తామంటూ ఏపీ ప్రభుత్వంతో బైజూస్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కంటెంట్ అందజేయలేక బైజూస్ చతికిలపడింది.

ఒప్పందం ముసుగులో బైజూస్‌కు జగన్‌ ప్రభుత్వం  కోట్లు దోచిపెట్టినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బైజూస్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడానికి 4.5 లక్షల ట్యాబ్‌లను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ట్యాబ్‌ల కొనుగోలు కోసం రూ.500 కోట్లు కేటాయించింది. బైజూస్‌తో ఒప్పందాన్ని ఏపీ సర్కార్‌ తొలి నుంచి రహస్యంగానే ఉంచింది. ఒప్పందం కాపీని ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా బయటపెట్ట లేదు.