లిక్కర్ స్కాంలో అప్రూవర్ గా మారిన బుచ్చిబాబు!

ఢిల్లీ లిక్కర్  స్కామ్‌ కీలక మలుపు తిరిగింది. బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్‌‌ గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌‌గా మారాడు. కేసులో  దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తానని చెప్పాడు. దీంతో ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సౌత్‌గ్రూప్‌ లిక్కర్ సిండికేట్‌ చిట్టా బయటపడనుంది. ఈ కేసులో ఇప్పటికే అరుణ్‌ రామచంద్రపిళ్లై, విజయ్‌నాయర్‌‌, దినేష్‌అరోరాలు అప్రూవర్ లుగా మారిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సౌత్‌గ్రూప్‌ ఆడిటర్‌‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు కూడా అప్రూవర్‌‌గా మారడంతో సీబీఐ,ఈడీ దర్యాప్తుకు లైన్ మరింత క్లియర్ అయింది. లిక్కర్ పాలసీ స్కామ్‌లో సౌత్‌గ్రూప్‌ నుంచి అరుణ్‌ రామచంద్రపిళ్లై, బుచ్చిబాబు కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్ లో  గతేడాది ఆగస్ట్‌17న సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి  మనీష్ సిసోడియా, ఎక్సైజ్‌ అధికారులతో పాటు మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్రపిళ్లైని 14వ నిందితుడిగా చేర్చారు. సెప్టెంబర్‌‌లో హైదరాబాద్‌లో సీబీఐ సోదాలు నిర్వహించింది. పిళ్లైని అదుపులోకి తీసుకుని విచారించారు. లిక్కర్‌‌ స్కామ్‌లో ఆధారాలు బలంగా ఉండడంతో అరుణ్‌ పిళ్లై అప్రూవర్‌‌గా మారినట్లు తెలిసింది.

రూ.100 కోట్లకు పైగా ముడుపులు చేతులు మారినట్లు ఆధారాలు సేకరించింది. సౌత్‌గ్రూప్‌ నుంచి బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిగా అరుణ్‌ రామచంద్ర పిళ్లై వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీబీఐ,ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించారు.

అరుణ్‌ రామచంద్రపిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌, ఆధారాలను కోర్టుకు సమర్పించారు. తాజాగా కవిత మాజీ ఆడిటర్, సౌత్‌గ్రూప్ ఆడిటర్‌‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌‌గా మారడంతో కేసు విచారణ కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.  బుచ్చిబాబు వెల్లడించే వివరాల ఆధారంగా  సౌత్‌గ్రూప్‌లో మరికొంత మందిని దర్యాప్తు సంస్థలు విచారించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన షెల్ కంపెనీలు, బినామీల అకౌంట్స్‌ నుంచి జరిగిన హవాలా లెక్కలు బయటపడనున్నాయి.