సుడాన్‌ నుంచి ప్రతి భారతీయుడిని సురక్షితంగా తరలిస్తాం

సుడాన్‌ నుంచి ప్రతి భారతీయుడిని సురక్షితంగా తరలిస్తాం
సుడాన్‌ లో చిక్కుకున్న భార‌తీయుల త‌ర‌లింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కావేరి’తో అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది.
 
కాగా, ఈ అంతర్యుద్ధంలో చిక్కుకుపోయిన ప్రతి భారతీయుడిని సురక్షితంగా తరలిస్తామని కేంద్ర విదేశాంగ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా స్పష్టం చేశారు.  సుడాన్‌ అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నంచి అక్కడి పరిస్థితులను నిరంతరం కంట్రోల్‌ రూమ్స్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
 
అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని ఘర్షణ ప్రాంతాల నుంచి వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించి, అక్కడి నుంచి వారిని స్వదేశానికి తీసుకురావడంపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపారు. సుడాన్‌లో 3,500 మంది భారతీయులు, 1000 మంది భారత సంతతి వ్యక్తులు చిక్కుకొని ఉండొచ్చని పేర్కొన్నారు.
 
‘ఆపరేషన్‌ కావేరి’ ద్వారా ఇప్పటి వరకు 1,700 మందికిపైగా భారతీయుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. తరలింపులో భాగంగా మూడో నౌక సూడాన్ పోర్టుకు చేరుకుందని, మరోవైపు సుడాన్‌ నుంచి సౌదీ అరేబియా చేరుకున్న 360 మంది భారతీయులు జెడ్డా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు.
 
కాగా, అంతకుముందు మొదటి బ్యాచ్‌లో భాగంగా భారత నావికాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్ సుమేదా’  ద్వారా 278 మంది ప్రయాణికులు సుడాన్‌ పోర్టు నుంచి సౌదీకి చేరుకున్నారని విదేశీవ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్‌  సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. . రెండో బ్యాచ్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌  విమానంలో 148 మంది భారతీయులను తొలి విమానంలో స్వదేశానికి తరలించినట్లు తెలిపింది.
 

కాగా, సుడాన్‌ నుంచి రెండో బ్యాచ్‌గా మరో 246 మంది భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన యుద్ధ విమానంలో గురువారం ముంబై చేరుకున్నారు. తొలుత సుడాన్‌ నుంచి వందలాది మంది భారతీయులను యుద్ధ నౌకల ద్వారా సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి భారత వాయుసేనకు చెందిన భారీ రవాణా విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ ద్వారా గురువారం ముంబైకి తీసుకొచ్చారు.

విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఆపరేషన్ కావేరీ మిషన్‌లో భాగంగా రెండో బ్యాచ్‌ కింద మరో 246 మంది భారతీయులు మరో విమానంలో దేశానికి తిరిగి వచ్చినట్లు పేర్కొన్నారు.  భారతీయుల తరలింపుకు సహకరిస్తున్న సౌదీ అరేబియాకి ఈ సందర్భంగా వినయ్‌ మోహన్‌ క్వాత్రా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఇతర దేశాల పౌరులను తరలించాలని అభ్యర్థనలు వస్తున్నాయని.. వాటిని భారత్‌ స్వీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, సుడాన్ నుంచి భారతీయల తరలింపులో ఇండియన్‌ నేవీ కూడా ఎంతో శ్రమిస్తున్నది. భారత నౌకా దళానికి చెందిన ఐఎన్‌ఎస్ టెగ్ గురువారం 297 మంది భారతీయులను సుడాన్ పోర్ట్‌ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించింది. భారత యుద్ధ నౌకల ద్వారా జెడ్డాకు చేరిన భారతీయుల రెండో బ్యాచ్‌ ఇది. 278 మంది భారతీయులతో కూడిన తొలి బ్యాచ్‌ ఐఎన్‌ఎస్ సుమేధ ద్వారా బుధవారం జెడ్డాకు తరలించారు. అనంతరం వీరందరినీ జెడ్డా నుంచి రెండు విమానాల్లో భారత్‌కు చేర్చారు.