100 కోట్ల మంది ప్రజలకు చేరిన కార్యక్రమం ‘మన్ కీ బాత్’

దేశ జనాభాలో 96 శాతం మంది ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా  ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలుసు.100 కోట్ల మంది ప్రజలు  ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని  కనీసం ఒక్కసారి అయినా విన్నారు. ప్రసార భారతి కోసం  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, రోహ్‌తక్ నిర్వహించిన సమగ్ర అధ్యయనంలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి.

ప్రసార భారతి సీఈవో గౌరవ్ ద్వివేది, ఐఐఎం రోహ్‌తక్ డైరెక్టర్ ధీరజ్ పి.శర్మ విలేకరుల సమావేశంలో ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించారు. కారక్రమాన్ని 23 కోట్ల మంది ప్రజలు క్రమం తప్పకుండా వింటున్నారని, మరో 41 కోట్ల మంది అప్పుడప్పుడు వింటున్నారని శర్మ వెల్లడించారు. ఈ  41 కోట్ల మంది క్రమం తప్పకుండా  శ్రోతలుగా  మారే అవకాశం ఉందని చెప్పారు.

 ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసారానికి జనాదరణ పొందడానికి సహకరించిన పరిస్థితులపై సర్వే నిర్వహించారు. ఈ  కార్యక్రమం పట్ల  ప్రజలు ఎందుకు ఇష్టపడుతున్నారు? అన్న అంశాన్ని సర్వే ప్రస్తావించింది.  ప్రేక్షకులతో భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకోవడం, శక్తివంతమైన నిర్ణయాత్మక నాయకత్వం వల్ల కార్యక్రమం విజయవంతం అయ్యిందని  సర్వే పేర్కొంది.

కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రధానమంత్రిని సర్వేలో పాల్గొన్న ప్రజలు  విజ్ఞానం, సానుభూతి మనస్తత్వం, ఏదైనా అంశాన్ని స్పష్టంగా చెప్పే సామర్థ్యం ఉన్న వ్యక్తిగా గుర్తించారు. ప్రజలతో నేరుగా మమేకం అవుతూ అవసరమైన   మార్గదర్శకత్వం ఇస్తున్న వ్యక్తి నిర్వహించడం  ‘మన్ కీ బాత్’ విజయానికి మరో కారణమని ప్రజలు పేర్కొన్నారు. 

99 సార్లు ప్రసారం అయిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ప్రజలపై చూపిన ప్రభావాన్ని కూడా సర్వే అంచనా వేసింది. కార్యక్రమం విన్న వారిలో మెజారిటీ శ్రోతలు ప్రభుత్వ పనితీరు పట్ల అవగాహన కలిగి ఉన్నారు. ఆశాజనకంగా ఉన్న 73 శాతంమంది  దేశం పురోగమనంలో ఉంది అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

58 శాతం మంది శ్రోతలు తమ జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సంఖ్యలో (59%) ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని తెలిపారు.  63 శాతం మంది ప్రజలు ప్రభుత్వం పట్ల తమ వైఖరి సానుకూలంగా మారిందని వెల్లడించారు.  60 శాతం మంది దేశ నిర్మాణం కోసం పని చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు అని సర్వేలో పేర్కొన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల ఆలోచనా దృక్పథం మారిందని సర్వే ద్వారా అంచనా వేయవచ్చు.

శ్రోతలను మూడు తరగతులుగా విభజించి సర్వే నిర్వహించారు. 44.7 శాతం  మంది శ్రోతలు  టీవీలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. 37.6 శాతం మంది మొబైల్ పరికరంలో కార్యక్రమాన్ని చూస్తున్నారు. 19 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు  62 శాతం మంది టీవీలో కార్యక్రమాన్ని చూసేందుకు ఇష్టపడుతున్నారు. 

హిందీ భాషలో ప్రసారం అవుతున్న’మన్ కీ బాత్’ కార్యక్రమం ప్రజల ఆదరణ ఎక్కువగా పొందింది. హిందీలో కార్యక్రమాన్ని చూడడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. హిందీ తర్వాత ఇంగ్లీష్ లో ప్రసారం అవుతున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమం 2వ స్థానంలో నిలిచింది. 

సర్వే నిర్వహించడానికి 10003 మందిని ఎంపిక చేసి అభిప్రాయాలూ సేకరించామని  డైరెక్టర్ ధీరజ్ శర్మ తెలియజేసారు, ఇందులో 60 శాతం మంది పురుషులు, 40 శాతం మంది మహిళలు ఉన్నారు.   68 వృత్తులకు చెందినవారు సర్వేలో  పాల్గొన్నారు. ఇందులో 64 శాతం మంది అనధికారిక, స్వయం ఉపాధి రంగానికి చెందిన వారు. సర్వేలో పాల్గొన్న వారిలో  23 శాతం  విద్యార్థులు పాల్గొన్నారు. 

సైకోమెట్రిక్‌గా ప్యూరిఫైడ్ సర్వే ఇన్‌స్ట్రుమెంట్ ద్వారా ఒక్కో జోన్‌కు సుమారు 2500 స్పందనలతో  భారతదేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాల సమాచారం సేకరించామని శర్మ తెలిపారు.

మన్ కీ బాత్ 22 భారతీయ భాషలు, 29 మాండలికాలతో పాటు, ఫ్రెంచ్, చైనీస్, ఇండోనేషియన్, టిబెటన్, బర్మీస్, బలూచి, అరబిక్, పష్టు, పర్షియన్, దరి, స్వాహిలి వంటి 11 విదేశీ భాషలలో ప్రసారం అవుతున్నదని గౌరవ్ ద్వివేది  తెలియజేశారు. ఈ  కార్యక్రమాన్ని ఆకాశవాణికి  చెందిన 500కి పైగా కేంద్రాలు ప్రసారం చేస్తున్నాయని ఆయన చెప్పారు

నిర్దిష్ట ఎపిసోడ్‌ల కోసం కాకుండా మొత్తం కార్యక్రమం చూపించిన ప్రాభవాన్ని అంచనా వేయడానికి సర్వే నిర్వహించామని  గౌరవ్ ద్వివేది తెలిపారు.  మన్ కీ బాత్‌ కి సంబంధించి  డిజిటల్ సెంటిమెంట్ తక్షణమే అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని పరిమితుల కారణంగా సాంప్రదాయ మీడియా విషయంలో అందలేదని  ఆయన తెలియజేశారు. సర్వే నిర్వహణ భాధ్యతను 2022 ఏప్రిల్ 18న ఐఐఎం రోహ్‌తక్‌కి అప్పగించారు.