మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్.. రూ.100 నాణెం విడుదల

ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకోబోతుంది. ఈ నెల 30వ తేదీన మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్కు చేరుకోనుంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ దేశానికి ఓ బహుమతి ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ 30 జరిగే మన్‌ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ రూ.100 నాణెంను విడుదల చేయనున్నారు. 

ఏప్రిల్ 30న ప్రధాని మోదీ విడుదల చేయనున్ననాణెంపై మైక్రోఫోన్‌ సింబల్ ఉంటుంది. దీనిపై 2023 అని ప్రింట్ చేసి ఉంటుంది. మన్ కీ బాత్ సందర్భంగా కేవలం ఒకే ఒక్క రూ. 100 నాణెం మాత్రమే ప్రింట్ చేయనున్నారు. ఈ నాణెంను వెండి, రాగి, నికెల్, జింక్‌తో తయారు చేశారు.

నాణె ముందు అశోక స్తంభం  ఉండనుంది. దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. ఓ వైపు భారత్ అని రాయడంతో పాటు, రూపీ సింబల్‌ కూడా ఉంటుంది. మైక్రోఫోన్‌ సింబల్‌తో పాటు సౌండ్ వేవ్స్‌ సింబల్‌ కూడా ఆర్బీఐ ప్రింట్ చేయనుంది.  హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మన్ కీ బాత్ 100 అని ప్రింట్ చేయనున్నారు. ఈ నాణెం బరువు 35 గ్రాములు ఉండనుంది.

రూ. 100 నాణెంను విడుదల చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ అనేక సందర్భాల్లోనూ రూ. 100 నాణెంలను ఆర్బీఐ ప్రింట్ చేసింది. అటల్ బిహారీ వాజ్‌పేయీ స్మారకార్థం గతంలో ప్రధాని మోదీ  100 రూపాయల నాణెం విడుదల చేశారు. రాజ్‌మాత విజయ్‌రాజ్ సిందియా శత జయంతి సందర్భంగా కూడా రూ.100 నాణెంను విడుదల చేశారు. మహారాణ ప్రతాప్ 476వ జయంతి సందర్భంలోనూ రూ. 100  నాణెం ప్రింట్ అయింది. 2010, 2011,2012, 2014, 2015లో రూ. 100 నాణెంలను కేంద్రం ప్రింట్ చేయించింది.