చైనాను మించి భారత్ లోనే అత్యధిక జనాభా

జనాభా విషయంలో చైనాను భారత దేశం అధిగమించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్‍ఎఫ్‍పీఏ) తాజా డేటా స్పష్టం చేసింది. చైనా కంటే భారత్ లో 29 లక్షల మంది జనాభా ఎక్కువగా ఉన్నారని తెలిపింది. చైనాను భారత్ ఎప్పుడు దాటిందో స్పష్టంగా వెల్లడించకపోయినా ప్రస్తుతం భారత్ లోనే జనాభా ఎక్కువగా ఉందని ఆ డేటా ప్రకటించింది.
ప్రస్తుతం భారత్ లో 142.86 కోట్ల జనాభా ఉంది. చైనా జనాభా 142.57 కోట్లుగా ఉందని ఆ డేటా వెల్లడించింది. 340 మిలియన్లతో అమెరికా మూడో స్థానంలో ఉందని వెల్లడించింది. “8 బిలియన్ జీవితాలు, అనంతమైన అవకాశాలు” పేరుతో “ది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, 2023”ను  యూఎన్‍ఎఫ్‍పీఏ ప్రచురించింది.
ప్రపంచవ్యాప్తంగా జనాభా 800కోట్లకు సమీపించిందని పేర్కొంది. చైనా కంటే భారత జనాభా 2.9 మిలియన్లు ఎక్కువగా ఉందని పేర్కొంది. చైనా జానాభాను భారత్ దాటడం 1950 తర్వాత ఇదే తొలిసారి. 1950 నుంచే ఐక్యరాజ్య సమితి పాపులేషన్ డేటాను వెల్లడిస్తోంది. “అవును, ఇరు దేశాల్లో వ్యక్తిగత డేటా సేకరణ సమయాలు భిన్నంగా ఉన్న కారణంగా చైనాను భారత్ ఎప్పుడు దాటిందో కచ్చితంగా స్పష్టం చేయలేకున్నాం” అని యూఎన్‍ఎఫ్‍పీఏ మీడియా, క్రైసిస్ కమ్యూనికేషన్స్ అడ్వయిజ్ అన్నా జెఫెరీస్ తెలిపారు.

చైనా జనాభా గతేడాది గరిష్టంకు చేరిందని, అప్పటి నుంచి తగ్గుతూ వచ్చిందని, భారత్ జనాభా మాత్రం పెరుగుతోందని జెఫెరీస్ చెప్పారు. భారత్ లో జనాభాలో ఏజ్ గ్రూప్‍ల శాతాన్ని యూఎన్‍ఎఫ్‍పీఏ డేటా వెల్లడించింది.

 భారత జనాభాలో 0 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 25 శాతం, 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 18 శాతం, 10 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు 26 శాతం ఉన్నారని ఆ డేటా వెల్లడించింది. ఇండియాలో 15 నుంచి 64 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వారు 68 శాతం మంది ఉన్నారని, 65 సంవత్సరాలకు పైబడిన వారు జనాభాలో 7 శాతంగా ఉన్నారని తెలిపింది.

చైనా జనాభాలో 65 ఏళ్లు దాటిన వారు 20 కోట్ల మంది ఉన్నారని ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ పేర్కొంది. ఆయుర్దాయం (జీవితకాలం) విషయంలో భారత్ కంటే చైనా మెరుగ్గా ఉందని ఈ యూఎన్‍ఎఫ్‍పీఏ డేటా స్పష్టం చేసింది. చైనాలో మహిళల సగటు ఆయుర్దాయం 82 సంవత్సరాలుగా, పురుషుల ఆయుర్దాయం 76 ఏళ్లుగా ఉన్నట్టు పేర్కొంది. భారత్ లో పురుషుల సగటు జీవితకాలం 74 సంవత్సరాలు, మహిళల ఆయుర్దాయం సగటున 71 ఏళ్లు ఉన్నట్టు వెల్లడించింది.

యువ జనాభా ఎక్కువగా ఉండడం భారత్‍కు చాలా సానుకూల అంశం అని, దేశాభివృద్ధికి ఇది చాలా తోడ్పడుతుందని యూఎన్ఎఫ్‍పీఏ డేటా పేర్కొంది. ఆర్థికంగా ఎదిగేందుకు కూడా భారత్ కు చాలా అవకాశాలు ఉన్నాయని తెలిపింది. 2022లో చైనా జనాభా ఏకంగా 85 లక్షలు తగ్గింది. ఆ దేశ జనాభా ఈస్థాయిలో తగ్గడం 1961 తర్వాత ఇదే తొలిసారి. అయితే 2011 నుంచి భారతదేశ జనాభా ఏటా సగటున 1.2 శాతం వృద్ధి నమోదవుతున్నదని తెలిపింది.